నరేంద్రమోడీ విజ్ఞప్తిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధిక్కరిస్తున్నట్లే ఉంది. ఏపీలో రాజకీయపార్టీగాను లేదా మిత్రపక్షంగా కూడా బీజేపీ జనసేనను పెద్దగా గౌరవించటంలేదు. ఈ విషయంలో పవన్ కు బాగా మంటగా ఉన్నట్లుంది. పేరుకు జనసేన-బీజేపీలు మిత్రపక్షాలే అయినప్పటికీ రెండింటికి ఏ విషయంలో కూడా పొత్తు కుదరటంలేదు. ఏ కార్యక్రమాలు నిర్వహించినా రెండుపార్టీలు దానికదే అన్నట్లుగా సాగిపోతున్నాయి.





ఎంతోకాలం మిత్రపక్షాలు కలిసుండవు అనే ప్రచారం అందరికీ తెలిసిందే. సరిగ్గా ఈ నేపధ్యంలో దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా జాతీయస్ధాయిలో ఆజాదీకా అమృతోత్సవ్ కార్యక్రమాలను నిర్వహించాలని నరేంద్రమోడి అనుకున్నారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కళ్ళు తమ సోషల్ మీడియా అకౌంట్ల డీపీలో జాతీయజెండాను ఉంచుకోవాలని పిలుపిచ్చారు. చాలామంది మోడీ చెప్పినట్లే చేశారు. కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధి, రాహుల్ గాంధి, ప్రియాంకా గాంధీలతో పాటు చాలామంది తమ ట్విట్టర్ అకౌంట్ల డీపీలో జాతీయజెండా కనబడేట్లుగా పెట్టుకున్నారు.





తెలుగురాష్ట్రాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి, కేసీయార్, చంద్రబాబునాయుడుతో సహా చాలామంది జాతీయజెండాను డీపీగా పెట్టుకున్నారు. అయితే పవన్ కల్యాణ్ మాత్రం పెట్టుకోలేదు. నరేంద్రమోడి అంటే తనకు చాలా ఇష్టమని, దేశాభిమానం తనలో చాలా ఎక్కువగా ఉందని తరచు ప్రకటించుకునే పవన్ తన ట్విట్టర్ ఖాతా డీపీలో మాత్రం జాతీయ జెండాను ఎందుకు పెట్టుకోలేదో అర్ధం కావటంలేదు.






జనసేన అధికారిక అకౌంట్ తో పాటు పవన్ వ్యక్తిగత ఖాతాలో కూడా జనసేన, పవన్ ఫొటోలే కనబడుతున్నాయి. మాట్లాడితే భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్ పేర్లను ప్రముఖంగా చెప్పే పవన్ ఇపుడు మోడీ ఇచ్చిన పిలుపుకు మాత్రం స్పందించలేదు. నరేంద్రమోడీ చెప్పినట్లు చేయటం ఇష్టంలేక లేకపోతే ఇంకేదైనా కారణముందా అన్నది తెలియటంలేదు. నిజానికి మోడీ చెప్పినట్లు చేయాలనే నిబంధనేమీ లేదు. మామూలు జనాల్లో చేసిన వాళ్ళు చేశారు లేనివాళ్ళు లేదు. సోషల్ మీడియా ఖాతాల్లో డీపీ పిక్చర్ గా జాతీయజెండాను పెట్టలేదంటే వాళ్ళకి దేశాభిమానం లేదని చెప్పేందుకు లేదు. కాకపోతే తరచూ మోడీపై అభిమానాన్ని చాటుకునే పవన్ ఎందుకు పెట్టలేదా అనేది అర్ధం కావటంలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: