‘ప్రజల్లో చైతన్యం రావాలి, ప్రజలంతా తిరుగుబాటు చేసి జగన్మోహన్ రెడ్డి పాలనకు అంతం పలకాలి’ ఇది తాజాగా దెందులూరు పర్యటనలో చంద్రబాబునాయుడు జనాలకు ఇచ్చిన పిలుపు. ‘ఇదేంఖర్మ...మనరాష్ట్రానికి’ అనే కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జగన్ పై అనేక ఆరోపణలు చేశారు. జగన్ పాలనను భస్మారసుర హస్తమని అభివర్ణించారు. మూడున్నరేళ్ళల్లో జగన్ పాలనవల్ల అన్నీవర్గాలు ఇబ్బందులు పడుతున్నాయని చంద్రబాబు చెప్పారు.






కాబట్టి తనకు అవకాశం ఇస్తే రాష్ట్రానికి పూర్వవైభవం తెచ్చేస్తారట. నిత్యావసర వస్తవుల ధరలన్నీ తగ్గించేస్తారట. సంపదను బాగా పెంచుతారట. పెరగబోయే సంపదతో సంక్షేమ పథకాలను ఇప్పటికన్నా మరింత మెరుగ్గా అమలుచేస్తారట. ప్రజలకు మంచి ఇళ్ళు కట్టిస్తారట, ఉద్యోగ, ఉపాధిమార్గాలను పెంచేస్తారట. హోలు మొత్తంమీద చంద్రబాబు చెప్పేదేమంటే తనకు అధికారం అప్పగిస్తే జనాలకు ఇక ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటానని.






ఇక్కడే చంద్రబాబు మాటలపై జనాల్లో అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇపుడు చెప్పినవన్నీ చేస్తారనే  2014లో జనాలు ఓట్లేసి గెలిపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమిచేశారో జనాలందరికీ అనుభవంలోకి వచ్చింది. అందుకనే 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడించింది. మళ్ళీ తనకు 2024ఎన్నికల్లో ఓట్లేసి అధికారం అప్పగిస్తే బ్రహ్మాండంగా చేస్తానని నమ్మబలుకుతున్నారు. మరి ఐదేళ్ళు అధికారంలో చంద్రబాబు ఎంత సంపద సృష్టించారు ? సంక్షేమపథకాలను అమలుచేసిన తీరు అందరు చూసిందే.





అమరావతిని రాజధానిగా ఎందుకు ఎంపికచేశారు ? దాని వెనకాల కథలేంటి అన్నది  అందరు చూస్తున్నదే. ఇక పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంలాగ వాడుకుంటున్నారని స్వయంగా నరేంద్రమోడీ చేసిన ఆరోపణలు అందరికీ గుర్తున్నాయి. అధికారంలో ఉన్నపుడు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతమందికి ఉపాధి చూపించారు ? తాను అధికారంలో ఉన్నపుడు ఎందుకు ఇళ్ళు కట్టించలేదు ? చంద్రబాబు పాలనా తీరుకు 2019 ఎన్నికల ఫలితాలే నిదర్శనం.  కాబట్టి తనకు మళ్ళీ అధికారం ఇస్తే జనరంజక పాలన అందిస్తామని చెబితే జనాలు నమ్ముతారా ? చంద్రబాబు కోరిక తీరుతుందా ?


మరింత సమాచారం తెలుసుకోండి: