మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు నాన్ లోకల్ దెబ్బ తప్పేట్లులేదు. మైలవరం ఇన్చార్జిగా ఉన్న ఉమాది అసలు నియోజకవర్గం నందిగామ. అయితే 2009 ఎన్నికల్లో నందిగామ ఎస్సీ రిజర్వుడు కావటంతో మైలవరంకు మారారు. అప్పట్లో మైలవరం నుండి పోటీచేయటంలో ఉమాకు ఎలాంటి సమస్య ఎదురుకాలేదు. కానీ వచ్చే ఎన్నికలకు మాత్రం నాన్ లోకల్ దెబ్బ తప్పేట్లు లేదు. సొంతపార్టీ నేతలే ఉమాను మూడు చెరువుల నీళ్ళు తాగిస్తున్నారు.





దీనికి ప్రధాన కారణం ఏవరంటే సీనియర్ నేత బొమ్మసాని సుబ్బారావనే చెప్పాలి. మంత్రిగా ఉన్నపుడే దేవినేని నియోజకవర్గంలోని చాలామందిని వ్యతిరేకం చేసుకున్నారు. పార్టీకి ఎంతో స్ట్రాంగ్ సపోర్టర్లు అనుకున్న వారు కూడా ఉమా బాడీ ల్యాంగ్వేజ్ కారణంగా వ్యతిరేకమైపోయారు. 2019 ఎన్నికల్లో పార్టీతో పాటు ఉమా కూడా ఓడిపోవటంతో కొద్దిరోజులు పార్టీ స్తబ్దుగా ఉంది. తర్వాత మాజీమంత్రి వ్యతిరేకులంతా ఏకమై సుబ్బారావు నాయకత్వంలో పనిచేయటం మొదలుపెట్టారు.





దాంతో ఉమాలో టెన్షన్ మొదలైంది. చివరకు సమస్య ఎంతగా ముదిరిపోయిందంటే మైలవరంలోని మెజారిటి నేతలు కలిసి సుబ్బారావునే తమ నేతగా ఎన్నుకున్నారు. దాంతో  వచ్చేఎన్నికల్లో లోకల్ అయిన తనకే టికెట్ ఇవ్వాలని చంద్రబాబునాయుడును అడుగుతున్నారు. ఉమాకు తెలీకుండానే నియోజకవర్గంలో పార్టీ సమావేశాలు అయిపోతున్నాయి. ఇపుడు ఇదేంఖర్మ..రాష్ట్రానికి కార్యక్రమం కూడా ఉమాతో సంబంధంలేకుండానే జరిగిపోతోంది. నియోజకవర్గం ఇన్చార్జిగా పేరుకుమాత్రమే ఉంటున్నారంతే. పార్టీ కార్యక్రమాలంతా సుబ్బారావు ఆధ్వర్యంలోనే జరిగిపోతున్నాయి.





పార్టీలో జరుగుతున్నది చూస్తుంటే అసలు సుబ్బారావుకు చంద్రబాబు లేదా లోకేష్ లో ఎవరో ఒక్కళ్ళ మద్దతుందా అనే అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి. సరే ఎవరి మద్దతున్నా లేకపోయినా వచ్చే ఎన్నికల్లో ఉమాకు టికెట్ దక్కటం అంత సులభంకాదని అర్ధమవుతోంది. ఒకవేళ టికెట్ తెచ్చుకున్నా గెలిచేదెట్లా ? టికెట్ అంటే చంద్రబాబు ఇవ్వగలరు కానీ గెలిపించలేరు కదా. ఉమా గెలవాలంటే లోకల్ నేతలే పనిచేయాలి. మరి వాళ్ళలో మెజారిటి వ్యతిరేకం అయినపుడు గెలవటం ఎలాగ ? ఇపుడిదే పెద్ద సమస్యగా మారిపోయింది.




మరింత సమాచారం తెలుసుకోండి: