వచ్చేఎన్నికల్లో అయినా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కల నెరవేరుతుందో లేదో అనుమానంగానే ఉంది. ఇంతకీ పవన్ కల ఏమిటని అనుకుంటున్నారా ? ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధులందరికీ కామన్ సింబల్ దక్కటం. పార్టీ కోణంలో జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసు. టీ తాగే గాజుగ్లాసును పవన్ ఇప్పటికి కొన్ని వందలసార్లు ప్రదర్శించుంటారు. బహిరంగసభల్లో కూడా ఒకపుడు గ్లాసును చూపించి ఓటేయమని అడిగేవారు. అయితే ఎన్నికలకు వచ్చేసరికి గాజు గ్లాసు మాత్రం పార్టీకి దక్కటంలేదు.




ఇపుడిదంతా ఎందుకంటే 2023-24లో ఎన్నికలను ఎదుర్కొనే రాష్ట్రాలు తొమ్మిది ఉన్నాయని కేంద్ర ఎన్నికల కమీషన్ ప్రకటించింది. తొమ్మిది అసెంబ్లీ ఎన్నికలు+లోక్ సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల గడువు 2024, జూన్ 11తో ముగుస్తోంది. అలాగే తెలంగాణాలో గడువు 2024, జనవరి 16తో ముగుస్తుంది. పార్లమెంటు ఎన్నికల గడువు 2024, జూన్ 16తో ముగియబోతోంది. కాబట్టి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయబోయే పార్టీలు కామన్ సింబల్ కోసం దరఖాస్తు చేసుకోమని కమీషన్ ప్రకటించింది.




ఇక్కడ సమస్య ఏమిటంటే కమీషన్ దగ్గర జనసేన రిజస్టర్డ్ పార్టీయే కానీ రికగ్నైజ్డ్ పార్టీకాదు. పార్టీకి రికగ్నిషన్ వస్తే కానీ కామన్ సింబల్ రాదు. రికగ్నిషన్ రావాలంటే కమీషన్ నిబంధనల ప్రకారం సదరు పార్టీకి ఓట్లు, సీట్ల లెక్కలు వేరే ఉన్నాయి. జనసేనకు అవేమీ లేవు. అందుకనే ఎన్నిక ఏదైనా సరే నామినేషన్ ముందుగా వేసినవాళ్ళు గాజుగ్లాసు గుర్తు కావాలంటే కమీషన్ ఇచ్చేస్తుంది. ఎందుకంటే గాజుగ్లాసు గుర్తు ఫ్రీసింబల్స్ లో ఉంది.



మొన్నటి స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పోటీచేసిన జనసేన అభ్యర్ధులు వేర్వేరు గుర్తులతోనే ప్రచారం చేసుకున్నారు. తిరుపతి లోక్ సభ, బద్వేలు, ఆత్మకూరు ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్ధులు గాజుగ్లాసు గుర్తుతో పోటీచేశారు. ఈ నేపధ్యంలో రాబోయే ఎన్నికల్లో అయినా జనసేన అభ్యర్ధులకు గాజుగ్లాసు వస్తుందా ? అన్నది సందేహంగా మారింది. ఈమధ్యనే గాజుగ్లాసు గుర్తు జనసేనకు కామన్ సింబల్ గా కేటాయించే అవకాశం లేదని కమీషన్ చెప్పేసింది. మరి స్పెషల్ రిక్వెస్టు చేసుకుంటే కమీషన్ అంగీకరిస్తుందేమో చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: