లాక్ డౌన్ నేపథ్యంలో మందుబాబులకు మద్యం దొరకని పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మద్యం షాపులను మూసివేయడంతో... మద్యం కోసం అలమటిస్తున్నారు మందు బాబులు. రోజు పొద్దున్న లేవగానే మద్యం తాగేంత వరకు రోజు గడవని మందుబాబులు ప్రస్తుతం మద్యం దుకాణాలు రోజుల తరబడి మూసివేయడంతో ఏమి చేయాలో తెలియని అయోమయ స్థితిలో పడిపోతున్నారు. కేవలం అత్యవసర సేవలు తప్ప మిగతా ఏ సేవలు కూడా అందుబాటులో లేకపోవడంతో కనీసం ఏమి దొరకని పరిస్థితి. ఈ క్రమంలోనే కొంతమంది కల్లు తాగుతూ కాలం గడిపేస్తూ ఉంటే ఇంకొంతమంది నాటుసారా తాగుతున్నారు.
మరికొంతమంది విషపూరితమైన మద్యం తాగుతూ ప్రాణాల మీదికి తెచ్చుకుని కుటుంబంలో విషాదం నింపుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో. కల్తీ మద్యం కారణంగా ఏకంగా నలుగురు మృతి చెందగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మధ్య ప్రదేశ్ లోని రథ్లం జిల్లాలో విషపూరిత మద్యం తాగి నలుగురు మృతి చెందారు ఇక ఇద్దరు చికిత్స తీసుకుంటూ ఉండగా వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. విషపూరితమైన మద్యం తాగిన వారిని హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించామని అక్కడి పోలీసులు తెలిపారు. వారిలో నలుగురు మృతి చెందగా... మరో ఇద్దరు ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు అని వెల్లడించారు పోలీసులు.
రథ్లం జిల్లాలోని పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నలుగురు వాంతులతో బాధపడుతూ ఆస్పత్రికి చేరుకున్నారు.. చికిత్స పొందుతూ 24 గంటల్లోనే వారు మృతి చెందినట్లు తెలిపారు. ఇక మిగతా వారికి ప్రస్తుతం చికిత్స అందుతుందని వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. మద్యం తాగే అలవాటు ఉన్న వీరు మద్యం షాపులు తెరవకపోవడం తో విషపూరితమైన మద్యం తాగి ప్రాణాలమీదకు తెచ్చుకున్నట్లు పోలీసులు వెల్లడించారు..