
దేశంలో సంచలనం రేపిన కాన్పూర్ కాల్పుల్లో ఎనిమిది మంది పోలీసులు కన్నుమూశారు. ఒక కేసులో గ్యాంగ్ స్టర్ వికాస్ దుబేని అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీస్ బృందాన్ని జేసీబీ తో ఆపి విచక్షణారహితంగా కాల్పులు జరిపి చంపిన విషయం తెలిసిందే. వెంటనే అక్కడ నుంచి వికాస్ దుబే తప్పించుకున్నాడు. కాన్పూర్ కాల్పులకు ప్రతీకారంగా పోలీసులు వికాస్ దుబే అనుచరులను ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మోస్ట్ వాటెండ్ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ఎన్ కౌంటర్ లో హతమయ్యాడు.. ఉజ్జయినీలో పట్టుబడ్డ వికాస్ దూబేని అక్కడి నుంచి ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ కు వాహనం తరలించారు. ఆ సమయంలో కాన్వాయ్ బోల్తా పడటం.. వికాస్ దుబే తప్పించుకోవడానికి ప్రయత్నించడం.. ఆత్మరక్షణకు ఎన్ కౌంటర్ చేయడం అంతా క్షణాల్లో జరిగిపోయింది.
తాజాగా వికాస్ దుబే హత్యాకాండ గురించి మరణించిన పోస్ట్ మార్టం రీపోర్ట్ లో భయంకరమైన నిజాలు బయట పడ్డాయి. తొలుత తుపాకులతో కాల్చిన దూబే బృందం, ఆపై గాయపడిన పోలీసులపై పదునైన ఆయుధాలతో దాడి చేసిందని వైద్యుల నివేదిక వెల్లడించినట్టు తెలుస్తోంది. పోలీసు బృందానికి నేతృత్వం వహించిన కమాండింగ్ ఆఫీసర్ మిశ్రా శరీరంలోకి నాలుగు బులెట్లు దిగడంతో పాటు, అతని శరీరంపై లోతైన కత్తి గాయాలు కూడా ఉన్నాయి. అతని తలకు ఓ బులెట్ తగిలిందని, మరొకటి గుండెల్లోకి, రెండు కడుపులోకి దూసుకెళ్లాయని ఈ రిపోర్టు పేర్కొంది. మరీ దారుణంగా మిశ్రా కాలును తెగనరకి, శరీరం నుంచి వేరుచేశారని పోస్టుమార్టం నివేదిక పేర్కొంది.
అన్ని బులెట్లూ పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి కాల్చినవేనని వెల్లడించింది. మిశ్రాని అత్యంత పాశవికంగా చంపినట్లు పోస్ట్ మార్టంలో తేలింది. మిగతా ఏడుగురు పోలీసులూ దారుణంగా చంపబడ్డారని నివేదిక వెల్లడించింది. కాగా, వికాస్ దూబే పోలీసులపై జరిపించిన దాడి, దాని తరువాత అతని ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు ప్రత్యేక విచారణ బృందాన్ని నియమించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం రిటైర్డ్ న్యాయమూర్తి శశికాంత్ అగర్వాల్ నేతృత్వంలో ఓ బృందాన్ని కూడా నియమించింది.