అటవీశాఖ అధికారులు అగ్ని ప్రమాదాల నివారణకు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఏదో ఒక రకంగా నిప్పు రగిలి కార్చిచ్చు అలుముకుంటోంది. నల్లమల మీదుగా అనేక ప్రధాన రహదారులు ఉన్నాయి. ఈ మార్గాల్లో వేలాది వాహనాలు తిరుగుతుంటాయి. వాహన చోదకులు, ప్రయాణికులు నిప్పును అడవిలో వది లేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి సంఘటనలు కర్నూలు-గుంటూరు, దోర్నాల- శ్రీశైలం రహదారులపై జరుగుతున్నాయి. చెంచులు వన్యప్రాణుల నుంచి రక్షణ పొందేందుకు ఏర్పాటు చేసుకునే మంటల వల్ల కూడా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి.నెల రోజుల క్రితం ఇలాగే నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట వద్ద ఉరుమండ సమీపంలోని హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారి వద్ద దాదాపు 30 హెక్టర్ల వరకు మంటలు వ్యాపించాయి.
ఈ ప్రమాదంలో దాదాపుగా 5 చదరపు కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం కాలిపోయింది. దీంతో స్పందిచిన అటవీ అధికారులు నాగర్ కర్నూల్, అచ్చంపేట నుంచి ఫైర్ సిబ్బంధికి సమాచారం అందించారు. ఈ సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, ఫైర్ ఇంజన్ తో మంటలు అంటుకున్న ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. శ్రీశైలం వెళ్లే దారిలో ఎవరైనా ధూమ పానం చేసి బీడీ లేదా సిగరెట్ ని అడవిలో పడేయడం వల్ల మంటలు వ్యాపించి ఉంటాయని అనుమానాలు వ్యక్తం చేసారు. ఇప్పటికే అడవిలో అక్కడక్కడా ఫైర్ బీట్లు ఏర్పాటు చేశామని మంటలు ఆ బీట్ల వద్దకు రాగానే ఆగిపోతాయని అటవీశాఖ అధికారులు తెలిపారు.