ప్రస్తుతం కోవిడ్ 19 మరింత ప్రమాదకరంగా మారి... శర వేగంగా వ్యాప్తి చెందుతున్న సందర్భంలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవడం ఎంతో కీలకంగా మారింది. అయితే మొదట్లో ప్రజలు వ్యాక్సిన్ పై వచ్చిన నెగటివ్ ప్రచారాలు విని టీకా తీసుకునేందుకు వెనుకంజ వేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు వ్యాక్సిన్ డోసులు తీసుకోవడం తప్పనిసరి  అయినందున... మనసులో ఏదో మూల అసంతృప్తితోనే వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే ఇది గమనించిన కేంద్ర ఆరోగ్య శాఖ, మరియు ప్రముఖ వైద్య నిపుణులు, వ్యాక్సిన్ సంస్థలు, శాస్త్రవేత్తలు... కరోనా వాక్సిన్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నడుం బిగించారు. సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున టీకా గురించి జనాలకు అర్థం అయ్యేలా వివరించారు.

కోవిడ్19 వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమని... కాకపోతే కొన్ని సూచనలు పాటించి తగిన జాగ్రత్తలు తీసుకొని టీకా వేయించుకోవాలని సూచించారు. బీపీ, షుగర్, మూత్రపిండాల సమస్య, క్యాన్సర్.. ఇలా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఆయా డాక్టర్లను సంప్రదించి వారి సూచనల మేరకు వ్యాక్సిన్ తీసుకోవచ్చా లేదా అని నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఇకపోతే టీకా తీసుకున్న తర్వాత జ్వరం, కాస్త వొళ్ళు నొప్పులు సహజమని అందుకు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ప్రజలకు టీకాపై విశ్వాసం ఏర్పడింది. కరోనా వ్యాక్సిన్ తీసుకునే వారి సంఖ్య పెరిగింది. అయితే ఇప్పుడు టీకాకు సంబంధించిన మరో అసత్య వార్త సోషల్ మీడియా ద్వారా జోరుగా ప్రచారం అవుతున్న నేపథ్యంలో... పిఐబి ఫ్యాక్ట్ చెక్ ద్వారా అసలు విషయం వెలువడింది.

ఇంతకీ అసత్య ప్రచారం ఏమిటంటే... మహిళలు వారి రుతుక్రమం సమయంలో, ఐదు రోజులు ముందు కానీ... ఋతుక్రమం వచ్చాక ఐదు రోజుల తర్వాత కానీ వ్యాక్సిన్ తీసుకోకూడదని ఇది చాలా ప్రమాదమని ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో వాస్తవం లేదని, మహిళలు రుతుక్రమం సమయంలో కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చని.. కాకపోతే కాస్త బలమైన ఆహారాన్ని.. పోషక ఆహారాన్ని తీసుకోవాలని పిఐబి ఫాక్ట్ చెక్ ట్విట్టర్ ద్వారా తెలియచేసింది. కాబట్టి వ్యాక్సిన్ పై మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా సదరు డాక్టర్ ని సంప్రదించాలి తప్ప.. ఇలా వచ్చే వార్తలన్నింటినీ చూసి భయాందోళనలకు గురి కాకూడదని చెబుతున్నారు. కాగా 18 సంవత్సరాల పైబడిన వారందరికీ మే 1 నుండి వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 28 నుండి ప్రారంభం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: