ఏపీలో ఇప్పుడు గ్రామాలలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయంటూ నిప్పులు చెరిగారు లోకేశ్. రెండేళ్ల జగన్ పాలనలో అన్నీ అరాచకాలు, విధ్వంసాలే జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు లోకేశ్. మాన్సాస్ ఇచ్చిన తీర్పు తప్పుడు జీవోలు జారీ చేస్తున్న జగన్ సర్కార్ కు చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు. ఇక గ్రామాల్లో ఇటీవల ఎన్నికైన టీడపీ సర్పంచులు అభివృద్ధి పనులను ప్రారంభిస్తామంటే వైసీపీ నాయకులు దాడులు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
సోషల్ మీడియాలో ఒక గ్రామ సర్పంచ్ పై జరిగిన దాడికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసిన నారాలోకేశ్... ఆ వివనాలపే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అమరావతి మండలానికి చెందిన ఉంగుటూరు గ్రామ సర్పంచ్ అనురాధ చెరువు మరమ్మతు పనులు ప్రారంభించడానికి వెళ్లిందన్నారు. కానీ వైసీపీ నాయకులు శివా గ్యాంగ్ అడ్డుకుని సర్పంచ్ భర్త సోమశేఖర్, అతని మనుషులపైదారుణంగా దాడి చేశారన్నారు.
ఇక ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం దారుణమని అసహనం వ్యక్తం చేశారు. సర్పంచ్ అంతు చూస్తామని హెచ్చరించడం వైసీపీ నాయకుల అరాచకాలకు అద్దం పడుతోందని లోకేష్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలపై చేస్తున్న దాడులకు ప్రతి దెబ్బకి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. త్వరలోనే అందరి ఖాతాలు సెటిల్ చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు లోకేశ్. గ్రామాల్లో మనుషుల్లాగా, మానవత్వంతో మెలిగితే గౌరవం ఉంటుందని లోకేష్ వివరించారు. అహంకారంతో అరాచకాలకు తెగబడితే రెండింతలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని లోకేశ్ హెచ్చరించారు.