ఏపీ టీడీపీ అధ్యక్షుడుగా ఉన్న అచ్చెన్నాయుడు జగన్ ప్రభుత్వంపై నిత్యం విరుచుకుపడుతూనే ఉన్నారు. తాజాగా కర్నూలు జిల్లాలో ఇద్దరు టీడీపీ నేతలని ప్రత్యర్ధులు హతమార్చిన విషయం తెలిసిందే. ఇక ఈ ఘటనపై చంద్రబాబుతో సహ టీడీపీ నేతలు జగన్ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. ఈ హత్యల వెనుక వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి హస్తం ఉందని బాబు ఆరోపిస్తున్నారు. అటు పోలీస్ వ్యవస్థపై బాబు విమర్శలు చేస్తున్నారు.


ఇక టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్న అయితే, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదనడానికి ఈ ఘటనే ఉదాహరణ అని, రాష్ట్రంలో పోలీసులు చోద్యం చూస్తున్నారని ఫైర్ అవుతున్నారు. అసలు టీడీపీ అధికారంలోకి వస్తే వడ్డీతో సహ చెల్లిస్తామని అచ్చెన్న విరుచుకుపడుతున్నారు. అయితే రాష్ట్రంలో ఏ ఘటన జరిగిన, దాన్ని జగన్ ప్రభుత్వంతో ముడిపెట్టి అచ్చెన్న విమర్శలు చేస్తూనే ఉన్నారు.


అలాగే తాము అధికారంలోకి వస్తే వైసీపీ నేతలు అంతుచూస్తామనే స్థాయిలో అచ్చెన్న మాట్లాడుతున్నారు. అంటే టీడీపీ అధికారంలోకి వస్తే వైసీపీ నేతలు వరుస పెట్టి జైలుకు వెళ్ళడం ఖాయమని రేంజ్‌లో అచ్చెన్న చెబుతున్నారు. అంటే నెక్స్ట్ అధికారంలోకి వస్తే వైసీపీపై కక్ష సాధిస్తామని డైరక్ట్‌గా చెబుతున్నారు.


అధికారంలోకి వచ్చాక చంద్రబాబుకు చెప్పి మరీ హోమ్ మంత్రి పదవి తీసుకుని, తమ సత్తా ఏంటో చూపిస్తామని గతంలో అచ్చెన్న మాట్లాడిన విషయం తెలిసిందే. అయితే అచ్చెన్న ఈ రేంజ్‌లో మాట్లాడటానికి కారణాలు లేకపోలేదు. టీడీపీ అధికారం కోల్పోయాక చంద్రబాబుకు కుడిభుజంగా ఉన్న అచ్చెన్నని వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసిన విషయం తెలిసిందే.


గతంలో అచ్చెన్న మంత్రిగా ఉన్నప్పుడు జగన్‌ని అనేక సార్లు అవమానించారు. దీంతో టీడీపీ అధికారం కోల్పోయాక అచ్చెన్నని లక్ష్యంగా చేసుకుని జగన్ పావులు కదిపారు. ఈ క్రమంలోనే అచ్చెన్నని ఈ‌ఎస్‌ఐ స్కామ్‌లో అరెస్ట్ చేశారు. మంత్రిగా ఉన్నప్పుడు ఈ‌ఎస్‌ఐలో అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి, అచ్చెన్నని జైలుకు పంపారు. ఇక జైలు నుంచి బెయిల్ మీద బయటకొచ్చిన అచ్చెన్న ఏపీ టీడీపీ అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించి, జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. అలాగే ప్రతి సందర్భంలోనూ టీడీపీ అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహ చెల్లిస్తామని అంటున్నారు. మొత్తానికైతే అచ్చెన్న హోమ్ మంత్రి అయ్యేవరకు నిద్రపోయేలా కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: