రాష్ట్ర ప్రభుత్వం ఊహించిన విధంగానే ఫలితాలు వస్తుంటే స్థానిక పోరు మాత్రం ప్రజాభిప్రాయానికి ప్రామాణికం కానే కాదని ఇదంతా అధికార దుర్వినియోగంతో సాగిన ఎన్నిక అని టీడీపీ బాస్ తేల్చేశారు. పోనీ అలానే అనుకుందాం. వాటిని వ్యతిరేకించాలన్నా టీడీపీ పోటీ చేయాలి కదా! కానీ ఎందుకు చేయలేదు అని వైసీపీ ప్రశ్నిస్తోంది. దీనిపై కూడా టీడీపీ కౌంటర్ ఇస్తోంది. తాము పోటీ చేయాలనుకున్న చోట రాజకీయ గుండాల బెదిరింపులు ఎక్కువగా వచ్చాయని, దీంతో తమ అభ్యర్థులు వెనకడుగు వేయాల్సి వచ్చిందని చెబుతున్నాయి టీడీపీ వర్గాలు.
చాలా రోజుల తరువాత ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం విభాగం రాష్ట్ర అధ్యక్షులు మీడియా సాక్షిగా జగన్ పై ఫైర్ అయ్యారు. ఇవి ప్రజాభిప్రా యం ప్రకారం జరిగిన ఎన్నికలు కానే కావని, ఇవి కేవలం అధికార దర్పంతో జరిగిన ఎన్నికలు అని కోపం అయ్యారు. తాము మొ దట నుంచి ఇవి అధికార పక్షాన్ని మోసే ఎన్నికలు తప్ప ప్రజాభిప్రాయం చెప్పేందుకు సరైన ఎన్నికలు ఇవి కావని అంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో చట్టాల అమలు సరిగా లేదని, వాటిని ఉల్లంఘించేవారే పెద్దవారుగా చెలామణీ అవుతున్నారని వాపోయారు. రాజ్యాంగ స్ఫూర్తిని చెడగొడుతూ పాలన సాగిస్తున్న జగన్ మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలన్నీ విపక్షాల మనో నిబ్బరాన్ని దెబ్బ తీసే విధంగానే ఉంటున్నాయని, అంతేతప్ప ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఆయన పనిచేయడం లేదని పెదవి విరిచారు.