ఇదిలావుంటే, ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నోట అటు క్యాబినెట్ సహచరులతోనూ, ఇటు మంత్రివర్గ సమావేశంలో కూడా ప్రశాంత్ కిషోర్ ప్రస్తావన చేశారని విశ్వనీయవర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్ బృందం సర్వే చేస్తుందని, అందరూ ఎన్నికల క్యాంపెయిన్ వైపు షిప్ట్ కావాలని ముఖ్యమంత్రి తాజాగా జరిగిన క్యాబినేట్ సమావేశంలో మంత్రులకు హిత బోధ చేశారట. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై ప్రశాంత్ కిషోర్ బృందం సర్వే చేస్తుందని నిర్మొహమాటంగా చెప్పారట. మనం ఎక్కడ ఉన్నామో కూడా తెలుసుకుందామని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడంతో ఇప్పుడు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలలో కలకలం ప్రారంభమైంది.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే- తాజాగా పీకే బృందం ఇటీవల అంటే నెల రోజుల క్రితం ముంబయి ఐఐటీకి వెళ్లి తమకు సుమారు 150 మంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న వారు కావాలని, వారిని తాము రిక్రూట్ చేసుకుంటామని ప్రిన్సిపాల్తో మాట్లాడారట. ఆకర్షణీయమైన వేతనాలు, నెలకు లక్షన్నరకు తగ్గకుండా ఇస్తామని కూడా చెప్పారట. అవసరమైతే మరో 150 మందిని వేరే ఐఐటీల నుంచి తీసుకుంటామని సాక్షాత్తు ప్రశాంత్ కిషోర్ టీములో కీలకంగా ఉన్న వ్యక్తి రిక్రూట్ మెంట్కు సిద్ధపడినట్లు సమాచారం. మొత్తంమీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలోకి మళ్లీ ప్రశాంత్ కిషోర్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారన్న సంకేతాలు అయితే స్పష్టమయ్యాయి. మరి పీకే పునరాగమనం ఎప్పుడో చూడాలి.