
ఇరాన్కు లెబనాన్లో అత్యంత పవర్ఫుల్ ప్రాక్సీ అయిన హిజ్బుల్లా కూడా ఇప్పుడు పెద్దగా దాడులతో బదులివ్వడం లేదు. నిజానికి, ఏడాది క్రితమైతే ఇది ఊహించడానికే షాకింగ్గా ఉండేది. కానీ, 2023లో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులతో హిజ్బుల్లా బలహీనపడింది. ఆ సంస్థ సుదీర్ఘకాల నాయకుడు హసన్ నస్రల్లా హతమయ్యాడు. అంతేకాదు, 2024లో సిరియాలో అసద్ ప్రభుత్వం కూలిపోయాక, ఆ గ్రూపునకు సరఫరా మార్గాలు కూడా మూసుకుపోయాయి. ఇప్పుడు హిజ్బుల్లా కొత్త నాయకుడు కూడా ఇరాన్కు సాయం చేయడం కంటే, లెబనాన్ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది.
గాజాలోని హమాస్ పరిస్థితి కూడా దాదాపు ఇంతే. అది కూడా ఇప్పుడు వీక్ అయిపోయింది. ఇజ్రాయెల్తో రెండేళ్ల యుద్ధం గాజాను సర్వనాశనం చేసింది. కీలక హమాస్ నేతలు చనిపోయారు. వాళ్ల సైనిక సొరంగాలు, రాకెట్ వ్యవస్థలు కూడా తుడిచిపెట్టుకుపోయాయి. అక్టోబర్ 2023 దాడితో యుద్ధానికి హమాసే కారణమైనప్పటికీ, ఇరాన్ మాత్రం కేవలం రాజకీయ మద్దతు ఇచ్చిందే తప్ప, పెద్దగా సైనిక సాయం చేయలేదు.
ఒకప్పుడు ఇరాన్కు అండగా నిలిచిన ఇరాకీ షియా మిలీషియాలు కూడా ఇప్పుడు మౌనంగా ఉన్నాయి. కతాయెబ్ హిజ్బుల్లా అనే ఒక్క గ్రూప్ మాత్రమే ఏదో మొక్కుబడిగా బెదిరించింది. ఇరాక్ను అనవసరంగా యుద్ధంలోకి లాగడం ఇష్టంలేక, ఆ దేశ ప్రధాని ఈ మిలీషియాలను గొడవకు దూరంగా ఉంచుతున్నారు.
యెమెన్లోని హౌతీలు మాత్రం ఈ మధ్య కాలంలో కాస్త యాక్టివ్గా కనిపించారు. కానీ, అమెరికా వైమానిక దాడుల్లో వాళ్ల క్షిపణి వ్యవస్థలు దెబ్బతినడంతో, వాళ్లు కూడా ఇప్పుడు స్పీడ్ తగ్గించారు.
ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే, ఇరాన్ మిత్రదేశాలైన రష్యా, చైనా, ఉత్తర కొరియాలు కూడా ఆచితూచి అడుగులేస్తున్నాయి. రష్యా ఇజ్రాయెల్ను ఖండించినప్పటికీ, ఈ గొడవలో మరీ లోతుగా తలదూర్చడం లేదు. చైనా అయితే ఇరాన్ నుంచి భారీగా ఆయిల్ కొంటుంది, పైగా శాంతి మధ్యవర్తిగా వ్యవహరించాలని చూస్తోంది. ఉత్తర కొరియా పైకి సైలెంట్గా ఉన్నా, లోపాయికారీగా ఇరాన్కు సాయం చేస్తుందనే అనుమానాలున్నాయి.
భారత్ విషయానికొస్తే, తటస్థ వైఖరి అవలంబిస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్ రెండింటితోనూ భారత్కు మంచి సంబంధాలున్నాయి. 2024లో ఇరాన్లోని చాబహార్ పోర్టును 10 ఏళ్ల పాటు నిర్వహించేందుకు భారత్ ఒప్పందం కూడా కుదుర్చుకుంది.