ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేడి పెంచే పరిణామం నేడు నర్సీపట్నంలో చోటు చేసుకోనుంది. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి పోలీసులు అప్రమత్తంగా కఠిన ఆంక్షలు విధించారు. పర్యటనకు సంబంధించిన మార్గం, వాహనాల సంఖ్య, కార్యకర్తల సమీకరణపై స్పష్టమైన గైడ్‌లైన్స్‌ ప్రకటించారు. వాటిని ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు. డీజీపీ ప్రకటన ప్రకారం - జగన్ పర్యటన పూర్తిగా చట్టం నిర్దేశించిన పద్ధతిలోనే సాగాలి. సెక్షన్ 30 ప్రకారం అనుమతించిన మార్గంలోనే ఆయన కాన్వాయ్ కదలాలి. మార్గం మధ్యలో వాహనాలను ఆపడం, రోడ్లను బ్లాక్ చేయడం, భారీ ర్యాలీలు, ఊరేగింపులు ఏవీ అనుమతించబోవని స్పష్టంగా చెప్పారు.

ఆంక్షలను ఉల్లంఘిస్తే, అనుమతి ఆటోమేటిక్‌గా రద్దవుతుందని, అంతేకాదు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని డీజీపీ వార్నింగ్ ఇచ్చారు. ఇంతటితో ఆంక్షలు ఆగలేదు… జగన్ కాన్వాయ్‌లో గరిష్టంగా పది వాహనాలకు మాత్రమే అనుమతి ఉంది. అదనంగా ఒక్క వాహనం కూడా చేర్చరాదని స్పష్టం చేశారు. కార్యకర్తలు భారీగా చేరి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తే, పార్టీ హోదా లేకుండా నేరుగా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. “రాజకీయ పార్టీ అని ఉపేక్షించేది లేదు… చట్టం ముందు అందరూ ఒకరే” అని డీజీపీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జగన్ పర్యటనలో జరిగే ప్రతి అడుగుపై పోలీసు వ్యవస్థ నిఘా ఉంచనుంది. అనుమతించిన ప్రదేశాల్లోనే రాజకీయ నినాదాలు, స్వాగతాలు ఉండాలని, మిగతా ప్రదేశాల్లో సభలు లేదా మీటింగులు కఠినంగా నిషేధించబడ్డాయి.

కార్యకర్తలను అధికంగా సమీకరించి కల్లోలం సృష్టించే ప్రయత్నం చేసినా, చట్టం తన పని చేసుకుంటుంది అని డీజీపీ స్పష్టం చేశారు. ఏదైనా ప్రమాదం, ఆస్తినష్టం, ప్రాణ నష్టం జరిగినా - దానికి బాధ్యత నిర్వాహకులదే అవుతుందని ఆయన తెలిపారు. దీనికి సంబంధించి లిఖితపూర్వక హామీ పత్రం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తం పద్దెనిమిది రకాల నిబంధనలను పోలీసులు విధించారు. వీటిని ఉల్లంఘించడం అంటే - జగన్ పర్యటనకు బ్రేక్ పడినట్టే. రాష్ట్ర రాజకీయాల్లో జగన్ పర్యటనపై ఈ రేంజ్‌లో ఆంక్షలు విధించడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. రాజకీయ వేడిలో పోలీసులు “లీగల్ వార్నింగ్” ఇవ్వడం గమనార్హం. ఇప్పుడు అందరి దృష్టీ జగన్ పర్యటన ఎలా సాగుతుందనేదానిపైనే ఉంది!

మరింత సమాచారం తెలుసుకోండి: