బీహార్ రాజకీయాలు ఎత్తుకు పై ఎత్తుగా సాగుతున్నాయి. ప్రతి పార్టీ తమ వ్యూహాలకు పదును పెడుతూ, ఎన్నికల కసరత్తులో గట్టిగా దూసుకుపోతున్నాయి. ఒకవైపు ఎన్డీయే కూటమి, మరోవైపు మహాఘట్‌బంధన్ - ఈ రెండింటి మధ్య సరికొత్త రాజకీయం రగులుతోంది. ముఖ్యంగా తేజస్వీ యాదవ్‌ నేతృత్వంలోని ఆర్జేడీ బీజేపీని వ్యూహాత్మకంగా కార్నర్ చేస్తోందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. మహాఘట్‌బంధన్‌ మొదటి నుంచీ బీజేపీపై ఒత్తిడి తెచ్చేలా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు? అనే ప్రశ్నను పదే పదే రేపుతూ, ఎన్డీయేను క్లిష్ట స్థితిలోకి నెట్టింది. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడంలో బీజేపీ మొదట జంకుతూ కనిపించింది.
 

కారణం స్పష్టమే - నితీష్‌కుమార్‌ పేరు ముందుకు వస్తే యాంటీ ఇంకెంబెన్సీ గాలి ఎన్డీయే వైపు తగిలే ప్రమాదం ఉంది. అదే సమయంలో యువ నాయకుడు తేజస్వీ యాదవ్‌తో పోల్చితే నితీష్‌ నేతృత్వం పాతబడి కనిపించే అవకాశం ఉందనే భయం కమలం శిబిరాన్ని కుదిపేసింది. అయితే ఆర్జేడీ మాత్రం ఈ బలహీనతను చక్కగా క్యాష్ చేసుకుంది. “మీ సీఎం అభ్యర్థి ఎవరు?” అన్న ఒక్క ప్రశ్నతోనే ప్రత్యర్థిని బలహీనపరిచింది. చివరకు, ఒత్తిడి తట్టుకోలేక బీజేపీ తమ సీఎం అభ్యర్థిని ప్రకటించింది. అమిత్‌ షా స్వయంగా నితీష్‌కుమార్‌ పేరును ప్రకటిస్తూ “బీహార్‌ అభివృద్ధికి ఆయనదే సరైన నాయకత్వం” అని ప్రకటించారు. అయితే ఈ నిర్ణయం పార్టీ అంతర్గతంగా ఏకగ్రీవం కాదని, కొందరు బీజేపీ నేతలు అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఇక అమిత్‌ షా వ్యాఖ్యలు మరింత ఆసక్తికరంగా మారాయి.



 “పొరపాటున మహాఘట్‌బంధన్‌ అధికారంలోకి వస్తే బీహార్‌ మరో ఇరవై ఏళ్ల వెనక్కు వెళ్తుంది” అని ఆయన హెచ్చరించారు. అయితే ఈ మాటలే రాజకీయ చర్చకు దారి తీశాయి. “పొరపాటున” అన్న పదం బీజేపీ వైపు కొంత ఆత్మవిశ్వాస లోపం చూపుతోందా? అన్న సందేహం తలెత్తింది. మొత్తానికి, ఆర్జేడీ వ్యూహం పనిచేసినట్లే ఉంది. నితీష్‌ కుమార్‌నే సీఎం అభ్యర్థిగా ప్రకటింప చేయడం ద్వారా తేజస్వీ సగం విజయం సాధించాడు అని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడు మిగిలిందల్లా ఓట్ల తుఫాన్‌నే. బీహార్‌ ప్రజలు మార్పుకు మొగ్గుతారా? లేక మళ్లీ నితీష్‌కే అవకాశం ఇస్తారా? అన్నదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం. ఎన్నికల వేళ బీహార్‌ రాజకీయాలు చెస్‌ గేమ్‌లా మారాయి. ఒక్క పావు తప్పా.. ఆట మొత్తం మారిపోవచ్చు. తేజస్వీ యాదవ్‌ వేసిన చెస్‌మెట్‌కి బీజేపీ ఎంతవరకు సమాధానం చెబుతుందో చూడాలి మరి!

మరింత సమాచారం తెలుసుకోండి: