గుజరాత్ చరిత్రలో మొద‌టిసారిగా నాలుగేళ్ల బాలికపై అత్యాచారం కేసులో అరెస్ట్ అయిన‌ నిందితులపై 10 రోజుల్లోనే సూరత్ పోలీసులు  కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. నిందితుడికి జైలు శిక్ష విధించింది కోర్టు. కేవ‌లం ఐదు రోజులలోనే శిక్షను ఖరారు చేసింది. ఆఖరి శ్వాస వరకూ జీవిత ఖైదు శిక్షను విధించింది కోర్టు.  సూరత్‌లోని సచిన్ జీఐడీసీ పోలీస్ స్టేషన్ ప్రాంతం నుంచి అక్టోబర్ 12 న నాలుగేండ్ల  బాలిక అదృశ్యమైంది. సూరత్ పోలీస్ కమిషనర్ అజయ్ కుమార్ తోమర్ మాట్లాడుతూ ఆ సమయంలో 10 పోలీసు బృందాలు 5 గంటలపాటు గాలింపు చేప‌ట్ట‌గా రాంశ్వర్ కాలనీ సమీపంలోని ఇండస్ట్రియల్ పార్క్ వెనుక పొదల్లో బాలిక ఆచూకి ల‌భ్య‌మైన‌ది.

బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లి తీవ్ర గాయాలపాలైంది, దీంతో ఆసుపత్రికి తరలించారు. బాలికపై అత్యాచారం జరిగిందని  ఆసుప‌త్రి వైద్యులు వెల్ల‌డించారు. బాలిక ప్ర‌యివేటు భాగాల్లో కూడా గాయాలవ్వడాన్ని గుర్తించారు వైద్యులు.  పోలీసులు సీసీటీవీ ఫుటేజీ సహాయంతో అత్యాచారానికి పాల్పడిన 39 ఏండ్ల హ‌నుమాన్ అలియాస్ అజయ్ మంగి నిషాద్‌ను అరెస్టు చేసారు. 10 రోజుల్లోనే పోలీసులు ఈ కేసుకు సంబంధించిన‌ చార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించారు.  60 మంది ప్రత్యక్ష సాక్షులు సూరత్‌లోని ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి  పీఎస్‌ కాలా ముందు వాంగ్మూలం ఇచ్చారు. తాజాగా నిందితుడికి జీవిత ఖైదును విధిస్తూ కోర్టు తీర్పును వెల్ల‌డించింది. ఇది గుజ‌రాత్‌లో ఒక సంచ‌ల‌నాత్మ‌క తీర్పు అని ప‌లువురు పేర్కొంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: