హఫీజ్ కు చెందిన ఆస్తులు స్తంభింపజేయాలని పాక్ యాంటీ టెర్రరిజం కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. జమాత్ -ఉద్ -దవా చీఫ్ హఫీజ్ సయీద్ నిర్మించిన మసీదు, మదర్సాను పాక్ అధికారులు స్వాధీనం చేసుకుంటారు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చారన్న కేసులో జమాత్ -ఉద్ -దవా చీఫ్ హఫీజ్ సయీద్ కు 2020లో 15 ఏళ్ల జైలు శిక్ష పడింది. 2008లో జమాత్ -ఉద్ -దవా చీఫ్ హఫీజ్ సయీద్ సూత్రధారిగా జరిగిన ముంబయి దాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్ ను భారత్కు అప్పగించాలని కేంద్రం పలుమార్లు కోరినా పాక్ పట్టించుకోలేదు.
అయితే.. పాకిస్తాన్ కోర్టులు ఇలాంటి విషయాల్లో తీర్పులు బాగానే ఇస్తున్నాయని ఈ తీర్పు ద్వారా మనం భావిస్తే.. పొరపాటే. అంతర్జాతీయంగా చెప్పుకునేందుకు.. తాము ఉగ్రవాదంపై గట్టి చర్యలు తీసుకుంటున్నామని చెప్పుకునేందుకు పాకిస్తాన్ ఇలాంటి చర్యలు చేపట్టవచ్చని .. ఇలాంటి తీర్పులను నమ్మలేమని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ఉగ్రవాదంపై పాకిస్తాన్ సరిగ్గా పోరాడటం లేదని అమెరికా సహా అంతర్జాతీయ ప్రపంచం కొన్నాళ్లుగా గుర్రుగా ఉంది.
పాకిస్తాన్ పై ఉన్న ఉగ్రవాద ముద్రతో ఆ దేశానికి విదేశాల సాయం కూడ సరిగ్గా అందడం లేదు. పాక్ తనపై ఉన్న టెర్రరిస్టు ముద్రను చెరిపేసుకునేందుకు ఇలాంటి తీర్పుల ద్వారా ప్రయత్నిస్తోందన్న అనుమానాలు కూడా ఉన్నాయి.