ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని ఏపీ విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అంబేద్కర్ తెలిపారు. ప్రస్తుతానికి వాయుగుండం శ్రీలంకలోని జాఫ్నాకు తూర్పున 600 కి.మీ., చెన్నైకి తూర్పు-ఆగ్నేయంగా 670 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైందట. 48 గంటల్లో నెమ్మదిగా పశ్చిమ-వాయువ్య దిశగా తమిళనాడు మరియు దక్షిణకోస్తాంధ్ర తీరాల వైపు కదిలే అవకాశం ఉంది. వాయుగుండం ప్రభావంతో రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలు, రాయలసీమలోని చిత్తూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.


మత్స్యకారులు మంగళవారం వరకు దక్షిణకోస్తా-తమిళనాడు తీరం వెంబడి వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. వర్షాల నేపధ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వాయుగుండం దృష్ట్యా సంబంధిత జిల్లాల యంత్రాంగాన్ని ముందస్తు  చర్యల కోసం అప్రమత్తం చేసినట్లు విపత్తుల సంస్థ ఎండి బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: