ఇవాళ్టి భాజపా మహాధర్నాకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతినిచ్చింది. టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రాల లీకేజీకి నిరసనగా ఉదయం పది నుంచి సాయంత్రం 5 గంటల వరకు ధర్నా చౌక్ వద్ద భాజపా ధర్నా చేస్తుంది. సుమారు 300 నుంచి 500 మంది వరకు హాజరు కానున్న ధర్నాకు అనుమతివ్వాలని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి పోలీసులకు లేఖ పంపించారు. పోలీసులు స్పందించక పోవడంతో అనుమతి కోసం హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ వేశారు. పోలీసులు ధర్నాకు అనుమతి నిరాకరించినట్లు ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు నివేదించారు.


ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడం సహేతుకంగా, చట్టబద్ధంగా లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ధర్నా చౌక్ వద్ద అనుమతి ఇవ్వకపోతే ప్రజలు ధర్నా ఎక్కడ చేసుకుంటారని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. భాజపాకు షరతులతో కూడిన అనుమతిని హైకోర్టు ఇచ్చింది.ధర్నాలో ధర్నాలో 500 మందికి మించరాదని భాజపాకు హైకోర్టు షరతు విధించింది. ధర్నాకు తగిన భద్రత కల్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ధర్నాలో పాల్గొన్న నేతలు శాంతిభద్రతలకు భంగం కలిగే విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని భాజపాకు హైకోర్టు స్పష్టం చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

BJP