కొవిడ్-19 గురించి రోజురోజు కొత్త విషయం వెలుగులోకి వస్తుంది..! దాని పుట్టుక, వ్యాప్తి, లక్షణాలు, వైరస్ రూపాంతరం.. ఇలా ఏదో అంశంలో కొత్తకొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. నిరంతరం జరుగుతున్న పరిశోధనల ఫలితంగా ఇవి తెలుస్తున్నాయి. కరోనా వైరస్ సోకిన వారిలో రుచి, వాసన కనిపెట్టలేకపోవడం వంటి కొత్త లక్షణాలను వెలుగులోకి తెచ్చిన అమెరికా సంస్థ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తాజాగా.. మరో విషయాన్ని బయటపెట్టింది. కరోనా వైరస్ బారిన పడిన వారిలో మూడో రోజుకే వాసన పసిగట్టలేకపోవడం సంభవిస్తుందన్న విషయాన్ని తాజా అధ్యయనంలో గుర్తించింది. వీరిలో చాలా మంది రుచిని గ్రహించే శక్తిని కూడా కోల్పోతున్నారని సిన్సినాటి యూనివర్సిటీకి చెందిన ఓ పరిశోధకుడు వెల్లడించారు. ప్రత్యేకించి చిన్న వయసు బాధితులు, మహిళల్లోనే అత్యధికంగా గ్రహణశక్తిని కోల్పోతున్నట్టు గుర్తించామన్నారు.
*ఎంత ఎక్కువగా వాసన గుర్తించే శక్తిని కోల్పోతే అంత తీవ్రంగా ఇతర కొవిడ్-19 లక్షణాలు ఉన్నట్టు కూడా మా అధ్యయనంలో గుర్తించాం. అలాంటి వారిలో శ్వాస తీసుకోలేకపోవడం, జ్వరం, దగ్గు వంటి లక్షణాలు కూడా తీవ్రంగా కనిపించాయి* అని యూసీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ అహ్మద్ సెదాఘట్ వెల్లడించారు. స్విట్జర్లాండ్లోని ఆరవ్ కాంటోన్స్పిటల్లో 103 మంది కరోనా పేషెంట్లను ఆరు వారాల పాటు పరిశీలించిన మీదట ఈ లక్షణాలను గుర్తించినట్టు ఈ అధ్యయనం తెలిపింది. శ్వాస సరిగా తీసుకోలేక పోవడం, శ్వాసకోశ ఇబ్బందులతో కూడిన తీవ్రమైన కొవిడ్-19 లక్షణాలు ప్రారంభమైతే వెంటనే అప్రమత్తం కావాలని ఈ అధ్యయన నిపుణులు చెబుతున్నారు.