దేశంలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా లక్షణాలు ఉన్నవారు వెంటనే వైద్య చికిత్స తీసుకోవాలని.. క్వారంటైన్ లో ఉండాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ కొంత మంది నిర్లక్ష్యం వేల మందికి ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. తాజాగా ఎం.జి.ఎం హాస్పిటల్ నుంచి రిమాండ్ ఖైదీ పరారయ్యాడు. అతడిని హన్మకొండ సుబేదారికి చెందిన సయ్యద్ ఖైసర్ గా గుర్తించారు. 14చోరీలు చేసి గత నెలలోనే పట్టుబడ్డాడు ఖైసర్. చోరీల కేసుల్లో ప్రస్తుతం అతడు వరంగల్ సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా వున్నాడు.
అతనికి కరోనా లక్షణాలు కనిపించడంతో అతడిని చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తీసుకొచ్చారు జైలు అధికారులు. కరోనా లక్షణాలు ఉండటంతో అతని వద్ద శాంపిల్స్ సేకరించి.. కోవిడ్ వార్డులో చేర్పించారు. అక్కడ ఎస్కార్ట్ కూడా ఏర్పాటు చేసినప్పటికీ వారికి మస్కా కొట్టి తప్పించుకు పారిపోయాడు. ఈ నేపథ్యంలో మట్టెవాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు జైలు సిబ్బంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు..అతడి కోసం గాలిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి