అయితే.. అలాంటి రామోజీ రావు ఓ రచయితకు బ్లాక్ చెక్ పంపారట. మీకు ఇష్టం వచ్చినంత వేసుకుని నేను చెప్పిన పని అంగీకరించడం అని కోరుతూ లేఖ రాశారట.. ఇంతకీ ఆ రచయిత ఎవరు.. ఆయనకు అప్పజెప్పాలనుకున్న పని ఏమిటి.. ఆ విషయానికే వద్దాం.. రామోజీరావు ఈనాడు పత్రికతో ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత అన్ని పత్రికలు ఈనాడును అనుసరించడం ఓ తప్పనిసరి అయ్యింది.
ఇప్పటికీ తెలుగునాట ఈనాడుదే అగ్రస్థానం. అయితే.. ఈనాడు పత్రికలో సాహిత్యానికి సరైన స్థానం లేదన్నది సాహిత్యాభిమానుల నుంచి ఓ కంప్లయింట్ ఎప్పటి నుంచో ఉంది. అయితే సాహిత్యానికి దిన పత్రికకూ లింకు పెట్టడం రామోజీరావుకు ఇష్టం ఉండదని అంటారు. అలాంటి రామోజీ రావు.. ఓ సాహిత్య పత్రిక తీసుకురావాలని ఒక దశలో అనుకున్నారట. అందుకోసం ఆయన ఎవరిని ఎన్నుకున్నారో తెలుసా.. ప్రముఖ కవి, విమర్శకుడు, సాహితీశోధకుడు అయిన ఆరుద్ర గారిని.
ఈ విషయాన్నితాజాగా సీనియర్ జర్నలిస్టు తోట భావనారాయణ తన ఫేస్బుక్ పేజీలో పంచుకున్నారు. రామోజీరావు ఆరుద్రగారికి ఏమని లేఖ రాశారంటే.. అందరూ నన్ను సాహిత్యానికి వ్యతిరేకినని అనుకుంటారు కానీ.. దిన పత్రికల్లో సాహిత్యానికి మాత్రమే నేను వ్యతిరేకిని.. అందుకే ‘భారతి’ స్థాయిలో తాజాగా సాహిత్య పత్రిక పెట్టాలనుకుంటున్నాను.. అది కూడా మీరు సారధ్యం తీసుకుంటానని మాట ఇస్తేనే.. మీకు అంగీకారమైతే ఈ చెక్కు తీసుకోండి అంటూ బ్లాంక్ చెక్ పంపారట.
అయితే.. అందుకు ఆరుద్ర సున్నితంగా తిరస్కరిస్తూ తిరుగు లేఖ రాశారు. ఏమని అంటే.. కిడ్నీల వ్యాధితో ఆస్పత్రిలో ఉన్నప్పుడు మాగుంట సుబ్బారామిరెడ్డి గారు నాకు సాయం చేశారు. ఆయన వీక్లీ పెట్టే ఆలోచన ఉందని తెలిసింది. దాని కోసం పని చేస్తానని ఇప్పటికే మాటిచ్చినందువల్ల మీరిచ్చిన ఈ అవకాశాన్ని వాడుకోలేకపోతున్నానని తిరుగు లేఖ రాసి రామోజీరావు గారికి చెక్కు వెనక్కి పంపారట.