ఈ 35వ జాతీయ పుస్తక ప్రదర్శన ను పురపాలకశాఖ మంత్రి కేటీఆర్, మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి వివిధ పత్రిక సంపాదకులతో కలిసి ప్రారంభించనున్నారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా పుస్తక ప్రాముఖ్యత తగ్గలేదు. పుస్తకం ఒక తల్లి పాత్ర పోషిస్తుంది. ఈ పుస్తక ప్రదర్శనలో 300 స్టాళ్లలో 2వేల 500వందల పుస్తకాలను ఏర్పాటు చేయనున్నారు. బుక్ ఫెయిర్ ప్రాంగణానికి ప్రముఖ ఒగ్గుకథ కళాకారుడు మిద్దె రాములు పేరు పెట్టారు. వేదికకు కవి అలిశెట్టి ప్రభాకర్ పేరు ఖరారు చేశారు.
35వ జాతీయ పుస్తక ప్రదర్శనలో బాలల సాహిత్యం, ఆధ్యాత్మికం, వ్యక్తిత్వ వికాసం, ప్రముఖుల జీవిత చరిత్ర సహా వివిధ రంగాలకు చెందిన పుస్తకాలు ప్రదర్శనలో అందుబాటులో ఉంటాయి. ముఖ్యమంత్రి స్టాల్లో, కేసీఆర్పై వివిధ రచయితలు రాసిన పుస్తకాలు, ఉద్యమ ప్రస్థానం, ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాలపై పుస్తకాల అందుబాటులో ఉంచనున్నారు. కేంద్ర హిందీ సంస్థాన్ ఆధ్వర్యంలో ప్రత్యేకమైన స్టాల్ ఏర్పాటు చేశారు. ఇందులో తెలుగు, హిందీ, ఆంగ్లం, ఉర్దూ సహా ఇతర భారతీయ భాషల సాహిత్యంతో పాటు నవలలు, కథలు, శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం పుస్తకాలు అందుబాటులో ఉంటాయి.
పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారి కోసం స్టడీ మెటీరియల్స్, వివిధ పబ్లికేషన్స్కు సంబంధించిన పుస్తకాలు కూడా ప్రదర్శనలో లభిస్తాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ బుక్ ఫెయిర్ కోసం తెలంగాణ కళాభారతి మైదానాన్ని ఉచితంగా ఇస్తున్నారు.