విజయవాడలో నేటి నుంచి ప్రపంచ తెలుగు రచయితల ఐదో మహాసభలు జరగనున్నాయి. సామాజిక విలువలను కాపాడుతూ, భాష, సంస్కృతి, దేశీయ కళలు, సాహిత్యం, చరిత్రల అధ్యయనాల ద్వారా సామాజిక చైతన్యం కలిగించడం కోసం ఈ సభలు నిర్వహిస్తున్నారు. రెండు రోజులపాటు విజయవాడ మొగల్రాజపురంలోని సిద్ధార్ధ ఆర్ట్స్‌, సైన్స్‌ డిగ్రీ కళాశాలలో ప్రపంచ తెలుగు రచయితల ఐదో మహాసభలు జరగనున్నాయి. ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా, ప్రపంచ సాహిత్య వేదిక- అమెరికా, సిలికానాంధ్ర, సిద్ధార్ధ అకాడమీ, కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్వయంలో ఈ సభలు జరుగుతున్నాయి.


ఈ ప్రపంచ తెలుగు రచయితల ఐదో మహాసభలులకు ప్రపంచం నలుమూలల నుంచి సుమారు 1500 మంది రచయితలు, భాషాభిమానులు ప్రతినిధులుగా హాజరుకానున్నారు. మహాసభలు జరిగే ప్రాంగణాన్ని తెలుగు భాషా పరిరక్షణకు పాటుపడిన రాజరాజనరేంద్రుడి పేరు పెట్టారు. ఆదికవి నన్నయ్య వేదికపై ప్రారంభ సభ, సమాపన సభలు, తెలుగు వెలుగుల సభ నిర్వహిస్తారు. తెలుగు అకాడమి నిర్మాత, అధికార భాషా సంఘం చట్టం తెచ్చిన తొలి తెలుగు ప్రధాని పీవీ నరసింహారావు వేదికపై కవి సమ్మేళనాలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రపంచ తెలుగు రచయితల ఐదో మహాసభలలో మొత్తం 30 సదస్సులలో దేశ, విదేశాల నుంచి విచ్చేసిన 800 మంది ప్రతినిధులు పాల్గొంటారు.


ఇవాళ ఉదయం 10 గంటలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మహాసభలను ప్రారంభించనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు తెలుగు వెలుగుల సభలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ పాల్గొనే అవకాశం ఉంది. ప్రపంచ తెలుగు రచయితల ఐదో మహాసభలలో వంద మందికిపైగా రచయితలు తమ గ్రంథాలను ఈ సభల్లో ఆవిష్కరించే అవకాశం ఉంది. భాష కోసం విలువలతో కూడిన సామాజిక వ్యవస్థ కోసం ఈ మహాసభలు ఏర్పాటు చేస్తున్నారు. తెలుగు భాష గొప్పదనాన్ని, తెలుగు భాష తీయదనాన్ని ఈ తరానికి వారసత్వంగా అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మహాసభల నిర్వహాకులు భావిస్తున్నారు. ఇది సంధి కాలమని.. తెలుగును ఇప్పుడు కాపాడుకోలేకపోతే.. ముందు ముందు భాష మరింత గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుందని నిర్వాహకులు హెచ్చరిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: