తెలంగాణలో బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది. కేంద్రం తెలంగాణకు ఏమీ చేయలేదని.. కేంద్రం సాయం గురించి నిరూపిస్తే రాజీనామా చేస్తానని కేటీఆర్‌ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. కేటీఆర్‌ రిజైన్ లెటర్ రాసుకుని వస్తే చర్చిద్దామని బదులిచ్చారు. కేంద్రం 10 లక్షల ఉద్యోగాల ఖాళీలు కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని.. లక్షా 50 వేల ఉద్యోగాల భర్తీ ఇప్పటికి పూర్తయ్యిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెబుతున్నారు.


కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 20వ తేదీన  అపోయింట్మెంట్ లెటర్స్ అందిస్తామన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి... కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని 33 జిల్లాల్లో 4549 వెల్ నెస్ సెంటర్స్ ఇచ్చిందన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా 11 వేల టాయిలెట్స్ నిర్మాణం చేశామని... టీబీ నియంత్రణ కోసం ప్రతి ఒక్కరు టీబీ పేషంట్లను దత్తత తీసుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు.. తాను కూడా ఒక టీబీ పేషంట్ ని దత్తత తీసుకుంటున్నానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఫ్లోరోసిస్ నియంత్రణకు 800 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. పీఎం కేర్స్ నిధులతో తెలంగాణలో 50 ఆక్సిజన్ ప్లాంట్స్ అందుబాటులోకి తెచ్చామన్నారు.


వరంగల్ కాకతీయ, ఆదిలాబాద్ రిమ్స్ మెడికల్ కాలేజీల్లో సూపర్ స్పెషాలిటీ బ్లాకుల నిర్మాణం చేశామని... 240 కోట్లు రెండు ఆస్పత్రులకు మంజూరు చేశాం.. వాటి నిర్మాణం పూర్తయ్యిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మలక్ పేట ఆస్పత్రుల్లో బాలింతల మృతి దురదృష్టకరమన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. కేసీఆర్ రాజీనామా పత్రాన్ని రాసుకొని కేటీఆర్ వస్తే చర్చకు సిద్ధమన్నారు. తాను తండ్రిని అడ్డం పెట్టుకొని రాజకీయాల్లోకి రాలేదని... కేసీఆర్ కంటే దిగజారి కేటీఆర్ మాట్లాడటం దుదృష్టకరమని... కేటీఆర్ స్టేట్ మెంట్స్ తెలంగాణ ప్రజలు పట్టించుకోవడం లేదని అన్నారు.


కుర్ కురే పంపిణీ పై కేటీఆర్ మాట్లాడటం అనాథ చిన్నారులను అవమానించడమేనని.. దేశం ఆఫ్ఘనిస్థాన్ గా మారుతుందని.. కేసీఆర్ వ్యాఖ్యలు దేశ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉన్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: