హైదరాబాద్‌ సరూర్ నగర్ సభలో హైదరాబాద్ యువజన డిక్లరేషన్ సభకు యువ సంఘర్షణ సభగా పేరు పెట్టారు. ఈ నెల 8వ తేదీన సరూర్ నగర్ లో సాయంత్రం 3 గంటలకు నిర్వహించే యువ సంఘర్షణ సభలో ప్రియాంక గాంధీ పాల్గొంటారు. ఈ సభ లో హైదరాబాద్ యువ డిక్లరేషన్ ప్రకటిస్తారు.సరూర్ నగర్ లో యువ సంఘర్షణ సభ లోగోను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  ఆవిష్కరించారు. వరంగల్ రైతు సంఘర్షణ సభలో రైతు డిక్లరేషన్ ప్రకటించారు. విద్యార్ధులు, నిరుద్యోగుల కోసం హైదరాబాద్ యువ డిక్లరేషన్ ఉంటుంది.


విద్యార్థులు, నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాలను ఎలా ఆదుకుంటామో హైదరాబాద్ డిక్లరేషన్ లో ప్రకటిస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. టీఎస్పీఎస్సీని యూపీఎస్సీ తరహాలో నియమించి ఉద్యోగ నియామకాలు ఎలా చేపడతామో సభలో వివరిస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  అన్నారు. ప్రియాంక గాంధీ సభలో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తారని  రేవంత్ రెడ్డి అన్నారు.


కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొడితేనే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని  రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. విద్యార్థి , నిరుద్యోగుల మద్దతుగా తాము ఉన్నామని చెప్పడానికి ప్రియాంక గాంధీ ఇక్కడకు వస్తున్నారని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే అంటున్నారు. నిరుద్యోగుల పట్ల తెలంగాణ ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకే యువ సంఘర్షణ సభ, నిరుద్యోగులకు భరోసా కల్పించి వారిలో నమ్మకాన్ని కలిగించేందుకు ప్రియాంక గాంధీ వస్తున్నారని మాణిక్ రావ్ ఠాక్రే అంటున్నారు.


8వ తేదీన సరూర్ నగర్ లో జరగనున్న యువ సంఘర్షణ సభకు పెద్ద ఎత్తున యువత తరలివచ్చేట్లు చూడాలని ఠాక్రే పార్టీ శ్రేణులకు సూచించారు. 8వ తేదీన సరూర్ నగర్ లో జరగనున్న యువ సంఘర్షణ సభకు ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ ముఖ్యఅతిథిగా వస్తున్నందుకు పీసీసీ పీఏసీ సన్నాహక సమావేశం జరిగింది. సభను విజయవంతం చేసేందుకు పార్టీ అనుబంధ సంఘాల ఛైర్మన్ లతో సన్నాహక సమావేశం కూడా నిర్వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: