‘రేసు గుర్రం’ సూపర్ సక్సస్ తరువాత దర్శకుడు సురేంద్ర రెడ్డి టాప్ దర్శకుల లిస్టులో వెంటనే చేరిపోతారు అని అనుకున్నారు అంతా. దీనికి తగ్గట్టుగా అతడికి భారీ సినిమాల అవకాశాలు కూడ వచ్చాయి. చిరంజీవితో ఇతడు చేసిన ‘సైరా నరసింహా రెడ్డి’ మూవీ సగటు ప్రేక్షకుడి అంచనాలు అందుకోలేక పోవడంతో ఈమూవీ బ్లాక్ బష్టర్ హిట్ కాలేకపోయింది.
దర్శకుడుగా ‘సైరా’ మూవీతో సురేంద్ర రెడ్డికి మంచి పేరు వచ్చినప్పటికీ ఆతరువాత టాప్ హీరోల సినిమాల అవకాశాలు అతడికి రాలేదు. ఇలాంటి పరిస్థితులలో అఖిల్ తో తీస్తున్న ‘ఏజెంట్’ మూవీతో తిరిగి తన సత్తాను చాటాలని సురేంద్ర రెడ్డి భావిస్తున్నాడు. ఈమూవీ పై అఖిల్ స్థాయికి మించి బడ్జెట్ ఖర్చు అవడంతో ఈమూవీ బయ్యర్లకు వర్కౌట్ అవుతుంది అన్న సందేహాలు ఇండస్ట్రీ వర్గాలలో ఉన్నాయి.
ఇప్పటికే రకరకాల కారణాలతో ఈమూవీ విడుదల అనేకసార్లు వాయిదా పడింది. గత సంవత్సరం సమ్మర్ రేస్ లో ఈమూవీ విడుదల అవుతుంది అంటూ వార్తలు వచ్చాయి. ఆతరువాత ఈమూవీ ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదల అన్నారు. ఇలా అనేకసార్లు వాయిదా పడ్డ ఈమూవీని ఎట్టకేలకు ఈనెలాఖరున ఏప్రియల్ 28న విడుదల చేస్తున్నారు. ఈసినిమాను ప్రమోట్ చేస్తూ ఈమధ్య జరిగిన ఒక మీడియా సమావేశంలో ఈసినిమా ఆలస్యం అవ్వడం అన్నవిషయం పై సురేంద్ర రెడ్డి ఆశక్తికర సమాధానం ఇచ్చాడు. ఈ సినిమాకు వర్కింగ్ డేస్ 100 రోజులు మాత్రమే అని అయితే కరోనా వల్ల దాదాపు ఏడాది పాటు చిత్రీకరణ జరగలేదు అంటూ వాస్తవాన్ని వెల్లడించాడు.
అంతేకాదు తాను ఆరు నెలల పాటు ఆసుపత్రిలో ఉండటం వల్ల ఈసినిమా ఆలస్యం అయింది అంటూ మరో న్యూస్ బయటపెట్టాడు. దీనితో సురేంద్ర రెడ్డి ఎందుకు 6 నెలలు హాస్పటల్ లో ఉన్నాడు అంటూ చర్చలు మొదలయ్యాయి. అతడికి కరోనా సోకి ఇబ్బంది పడ్డాడా లేదంటే మరేదైనా పెద్ద సమస్య వచ్చిందా అంటూ సోషల్ మీడియాలో అతడి ఆరోగ్యం పై చర్చలు జరుగుతున్నాయి..