కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మహమ్మారి కారణంగా సినీ ఇండస్ట్రీకి కూడా కోలుకోలేని దెబ్బ పడింది. కరోనా దెబ్బకు సినిమా ఇండస్ట్రీ కూడా లాక్ డౌన్లోకి వెళ్లింది. ఇప్పటికే మల్టీప్లెక్స్, థియేటర్స్ క్లోజ్ చేశారు. థియేటర్స్ పూర్తిగా మూసేయడంతో డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్, థియేటర్స్ నిర్వాహకులు తీవ్ర గడ్డుకాలాన్ని ఎదర్కొంటున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలు షూటింగ్లకు బ్రేక్ ఇచ్చి, అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అంతేకాకుండా చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అని తేడా లేకుండా విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు తమ రిలీజ్ డేట్లను మార్చుకుంటూ వస్తున్నాయి. నిర్మాతలు, ఎక్జిబ్యూటర్లు, పంపిణీదారులు ఈ నెలాఖరుకు అన్నీ సర్దుకుంటాయని మొదట భావించాయి. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా సినిమా రిలీజ్ అయినా ప్రజలు థియేటర్లకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. అయితే ఒక సినిమా అనుకున్న సమయానికి విడుదల కాకపోతే నిర్మాతలు తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో ఈ నష్టాల నుంచి.. ఈ పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కాలా అని ఇండస్ట్రీ పెద్దలు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే షూటింగ్ పూర్తయిన సినిమాలను ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ద్వారా రిలీజ్ చేయాలని కొందరు నిర్మాతలు భావిస్తున్నారట. అయితే కొందరు నిర్మాలు ఇందుకు అంగీకరిస్తుండగా.. కొందరు మాత్రం ఒప్పుకోవడం లేదు.
ఇప్పటికే తెలుగులో అమృతరామమ్ అనే సినిమా థియేటర్లో రిలీజ్ కాకుండా డెరెక్ట్ గా ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్ హీరోగా నటించిన 'ఒరేయ్ బుజ్జిగా' సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ కాబోతుందని వార్తలు వస్తున్నాయి. దీనిపై ఆ సినిమా దర్శకుడు విజయ్ కుమార్ స్పందించాడు. ఆయన మాట్లాడుతూ 'మేము ఈ సినిమా ప్రేక్షకులకు అందించడానికి యూనిట్ మొత్తం సుమారు ఒక ఏడాది పాటు కష్టపడ్డాం. సినిమా రిలీజ్ కోసం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయలేమా.. ఎన్ని రోజులు వెయిట్ చేసైనా సరే మా సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేస్తాం. మీరు మా సినిమాను థియేటర్లలోనే చూడండి' అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ప్రస్తుతం మాజీ ప్రధాని దేవగౌడ మనవడితో స్పోర్ట్స్ నేపథ్యంలో ఒక సినిమా చేయబోతున్నాని.. లాక్ డౌన్ టైములో కొత్త స్క్రిప్ట్స్ రాస్తున్నానని.. వెబ్ సిరీస్ కి కూడా స్క్రిప్ట్ రాసే ఆలోచనలో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు.