తెలుగు సినీ ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న వంశీకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండస్ట్రీలో ఎన్నో బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన నిన్నే పెళ్ళాడుతా, సింధూరం, అంతఃపురం, మురారి, ఖడ్గం వంటి సినిమాల తో స్టార్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నాడు.
2017 లో 'నక్షత్రం' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన కృష్ణవంశీ మళ్లీ చాలా గ్యాప్ తర్వాత ఈ ఏడాది 'రంగమార్తాండ' సినిమాని తెరకెక్కించారు. బ్రహ్మానందం, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ లాంటి అగ్ర నటీ నటులు నటించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృష్ణవంశీ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా పెళ్లి, రమ్యకృష్ణతో విభేదాలపై కృష్ణవంశీ తాజా ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజానికి జీవితంలో అసలు పెళ్లి చేసుకోవద్దు అనుకున్నానని, అనుకోకుండా రమ్యకృష్ణ తన లైఫ్ లోకి వచ్చిందని ఈ సందర్భంగా చెప్పారు కృష్ణవంశీ." పెళ్లి, పిల్లలు, బాధ్యత.. వీటన్నిటికీ నేను కంఫర్ట్ కాదు. ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతాను. ఏకాకిగా కాదు, ఒంటరిగా ఉండడాన్ని మాత్రమే ఇష్టపడతాను. ఆ తర్వాత బాధ్యత అంటే చాలా భయం. ఒక ఫ్రీ సోల్ గా ఉండాలని అనుకొని పెళ్లి వద్దనుకున్నాను. ఆ తర్వాత అనుకోకుండా రమ్యకృష్ణ నా జీవితంలోకి వచ్చింది. నన్ను పెళ్లి చేసుకుంది" అని అన్నారు. రమ్యకృష్ణ మీ లైఫ్ లోకి వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు వచ్చాయని? అడిగితే.." ఎలాంటి మార్పులు రాలేదు. నన్ను అంత ఇబ్బంది పెట్టలేదు. ఇరుకున పెట్టలేదు. నన్ను నన్నుగా ఉండనిచ్చింది. తాను తనుగా ఉంది. మా పెళ్లి తర్వాత మా జీవితంలోకి మా కొడుకు తప్ప ప్రత్యేకంగా ఎలాంటి మార్పులు లేవు" అని తెలిపారు. డబ్బు కోసం మీరు రమ్యకృష్ణ పెళ్లి చేసుకున్నారని అలాగే పెళ్లి తర్వాత మీ ఇద్దరి మీద విభేదాలు వచ్చాయని రకరకాల వార్తలు రావడం పై కృష్ణవంశీ స్పందిస్తూ.." సెలబ్రిటీలు అన్న తర్వాత అలాంటి వార్తలు రావడం సర్వసాధారణం. అందరూ అలా ఆలోచించరు. ఎవరో కొందరు ఇలాంటి వార్తలను సృష్టిస్తుంటారు. అవి విన్నప్పుడు మేం కూడా నవ్వుకుంటాం. అందుకే నేను కూడా ఈ విషయాలను ఎప్పుడూ ఖండించలేదు. అలాంటివి విన్నప్పుడు మన గురించి బయట అలా కూడా మాట్లాడుకుంటున్నారా అని అనుకుంటా. ఇకపోతే మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నామంటూ" తాజా ఇంటర్వ్యూలో తెలిపారు కృష్ణవంశీ. దీంతో ప్రస్తుతం కృష్ణవంశీ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక రీసెంట్ గా 'రంగమార్తాండ' సినిమాతో ప్రేక్షకుల ముందు వచ్చిన కృష్ణవంశీ తన తదుపరిచిత్రాన్ని ఇంకా ప్రకటించాల్సి ఉంది.