టాలీవుడ్‌లో సమంతకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. గత కొంతకాలంగా ఆమె సినిమాలను చాలా ఆచి తూచి ఎంచుకుంటోంది. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురైనా, మళ్లీ మెల్లిగా గేర్ పెడుతోంది. కానీ ఇప్పటివరకు ఆమె తెలుగు ప్రేక్షకులకు కనబడటం మాత్రం కొంతకాలంగా లేదు. తాజాగా సమంత మళ్లీ తెలుగు పరిశ్రమకు ఒక సరికొత్త ప్రాజెక్ట్‌తో రీ ఎంట్రీ ఇవ్వబోతుందన్న వార్తలు సినీ వర్గాల్లో హల్‌చల్ చేస్తున్నాయి.ఈసారి ఆమె ఎంపిక చేసిన డైరెక్టర్ మరెవరో కాదు.. ‘ఓ బేబీ’ ఫేమ్ నందినిరెడ్డి. ఇదే కాంబినేషన్‌లో గతంలో రెండు సినిమాలు వచ్చాయి. వాటిలో “ఓ బేబీ” బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. నందినిరెడ్డి కి భావోద్వేగాలకు, ఫీమేల్ సెంట్రిక్ కథలపై మంచి పట్టుంది.


అదే లైన్‌లో ఆమె సిద్ధం చేసిన తాజా కథ, సమంతకు ఎంతగానో నచ్చిందని, ఆమె వెంటనే ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. సమంత ఇప్పటికే నిర్మాతగానూ అడుగులు వేస్తోందన్న విషయం తెలిసిందే. ఇటీవల ఆమె నిర్మించిన ‘శుభం’ అనే చిత్రం కమర్షియల్‌గా పెద్ద హిట్ కాకపోయినా, బిజినెస్ పరంగా లాభాలు తెచ్చిపెట్టిందట. ఇప్పుడు నందినిరెడ్డి దర్శకత్వంలో రూపొందే ప్రాజెక్ట్‌ను కూడా సమంత స్వయంగా నిర్మించనున్నట్లు సమాచారం. లిమిటెడ్ బడ్జెట్‌తో, కంటెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చేలా ఈ సినిమా రానుంద‌ని తెలుస్తోంది.ఈ సినిమా పూర్ణంగా  ఎమోషనల్ డ్రామా కావొచ్చని టాక్. హీరో విలక్షణంగా ఉండే పాత్రగా ఉంటుద‌ని భావిస్తున్నారు.


ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇందులో సమంత నటి గానే కాకుండా నిర్మాతగా కూడ కీలక పాత్ర పోషించనుంది. ఇంతకాలం హై-బడ్జెట్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టిన సమంత, ఇప్పుడు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలవైపు మళ్ళడాన్ని పరిశ్రమ అభినందిస్తోంది. మొత్తానికి, సమంత – నందినిరెడ్డి కాంబినేషన్ మళ్ళీ తెరపైకి రాబోతుందన్న వార్త తెలుగు సినీ ప్రేమికులను ఆనందపరుస్తోంది. “ఓ బేబీ” తరహాలోనే మరో మంచి కథను తెరపై చూపించబోతున్న ఈ జంట, మూడోసారి కూడా మ్యాజిక్ క్రియేట్ చేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: