సూపర్ స్టార్ రజనీకాంత్ – లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో ఒక భారీ మల్టీస్టారర్ సినిమా వస్తుందనే వార్త ఫ్యాన్స్‌లో ఎన్నాళ్లుగానో చర్చనీయాంశంగా మారింది. ఈ ఇద్దరు లెజెండ్స్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించాలని అభిమానులు ఏళ్ల తరబడి కోరుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఒక పబ్లిక్ ఈవెంట్‌లో కమల్ హాసన్, “త్వరలో మేము ఇద్దరం కలిసి ఓ సినిమా చేయబోతున్నాం” అని చెప్పడం వల్ల, ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆ వార్తపై హైప్ క్రియేట్ అయ్యింది. ఈ కాంబో వస్తే ఇప్పటివరకు ఉన్న రికార్డులు అన్నీ బ్రేక్ అవడం ఖాయమని ఇద్దరు స్టార్‌ల అభిమానులు ఆనందంతో ఊగిపోయారు.


అయితే ఆ తర్వాత నెలలు గడుస్తున్నా ఈ ప్రాజెక్ట్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోవడంతో, ఈ మల్టీ స్టారర్ సినిమా రానుందనే ఆశ అభిమానుల్లో తగ్గిపోయింది. ఇంతలోనే అనుకోకుండా కమల్ హాసన్ ఒక పెద్ద అనౌన్స్‌మెంట్ చేశారు. అయితే అది ఇద్దరు హీరోలు కలిసి నటించే సినిమా కాదు. రజనీకాంత్ హీరోగా, కమల్ హాసన్ నిర్మాణంలో ఒక భారీ బడ్జెట్ చిత్రం రాబోతోందని ఆయన ప్రకటించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు సుందర్ సి తెరకెక్కించనున్నట్టు మేకర్స్ వెల్లడించారు. దీంతో త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందన్న అంచనాలు మొదలయ్యాయి.


కానీ షాకింగ్‌గా, దర్శకుడు సుందర్ సి సోషల్ మీడియాలో ఒక నోట్ రిలీజ్ చేసి, ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు. దీంతో ఈ క్రేజీ కాంబోలో రానున్న సినిమా భవితవ్యంపై మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. ఆయన ఎందుకు తప్పుకున్నారనే విషయం పై ఇండస్ట్రీలో, అభిమానుల్లో అనేక రకాల ఊహాగానాలు కూడా మొదలయ్యాయి.తాజాగా ఈ అంశంపై నిర్మాత కమల్ హాసన్ స్పష్టత ఇచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ “ఈ ప్రాజెక్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదు. నేను ఈ సినిమాకు నిర్మాత మాత్రమే. మా హీరో గారికి కథ నచ్చలేదు. ఆయనకు నచ్చే వరకు సరైన కథను కనుగొనడం నా బాధ్యత. ప్రస్తుతం మేము ఇద్దరం కలిసి చేయబోయే చిత్రానికి కొత్త దర్శకుడిని వెతుకుతున్నాం” అని వెల్లడించారు. కమల్ హాసన్ వ్యాఖ్యలతో, రజనీకాంత్–కమల్ హాసన్ కాంబినేషన్ ప్రాజెక్ట్ ఇంకా కొనసాగుతుందన్న నమ్మకం అభిమానుల్లో మళ్లీ పెరిగింది. సరైన కథ, సరైన దర్శకుడు దొరికిన వెంటనే ఈ ప్రాజెక్ట్ అధికారికంగా మొదలయ్యే అవకాశం ఉందని టాలీవుడ్–కోలీవుడ్ వర్గాలు ఊహిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: