వరుణ్ తేజ్ - హరీష్ శంకర్ కాంబినేషన్లో ఈ రోజు విడుదలైన 'గద్దల కొండ గణేశ్' చిత్రం మాస్ ప్రేక్షకుల్లో మంచి టాక్ తెచ్చుకుంది. మొత్తానికి కొత్త లుక్ లో వరుణ్ తేజ్ బాగా ఆకట్టుకున్నాడు. అయితే విడుదల ముందు రోజు వరకూ వాల్మీకిగా చలామణి అయిన ఈ చిత్ర టైటిల్, చివరి క్షణాల్లో 'గద్దల కొండ గణేశ్'గా మార్చాల్సి రావడం చిత్ర యూనిట్ ని షాక్ కి గురిచేసింది. దీని పై దర్శకుడు మీడియా సాక్షిగా కొంచెం అసహనం వ్యక్తం చేశారు కూడా. చివరి నిముషంలో టైటిల్ మార్చడం వలన ప్రేక్షకులు తికమకకు గురయ్యే అవకాశం ఉందనేది వాస్తవమే. అందుకే ఈ సంఘటన పై చిత్ర ప్రముఖులు వాల్మీకి చిత్ర యూనిట్ కి మద్దతు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు వంశీ పైడిపల్లి, హీరో విజయ్ దేవరకొండ, సాయి ధరమ్ తేజ్ అలాగే మరికొందరు, వాల్మీకి టైటిల్ మార్పు పట్ల విచారం వ్యక్తం చేశారు. తాజాగా దిల్ రాజు కూడా విచారం వ్యక్తం చేశాడు. పైగా భవిష్యత్తులో ఇలా ఏ సినిమాకి జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి త్వరలో ఓ లెటర్ కూడా పెట్టాలని నిర్మాతల మండలి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమా విషయానికి వస్తే.. మాస్ ప్రేక్షకులను మూవీ బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా హరీశ్ శంకర్ మెగా ఫ్యాన్స్ బాగా ఆకట్టుకున్నాడు. మెగా సినిమాలు అంటేనే హరీశ్ శంకర్ టాలెంట్ ఒక్కసారిగా బయటకు వచ్చేస్తోంది. హరీష్ శంకర్ ఏడు సినిమాలు చేస్తే అందులో 4 సినిమాలు మెగా హీరోల సినిమాలే ఉండటం విశేషం. పవన్ కళ్యాణ్ హీరోగా 'గబ్బర్ సింగ్' సినిమాను తెరకెక్కించి ఇండస్ట్రీ హిట్ రాబట్టి పవర్ స్టార్ అభిమానుల్లో మంచి గౌరవం దక్కించుకున్న హరీష్ శంకర్ ఆ తర్వాత కూడా అదే విజయపరంపరను కొనసాగించారు.
సాయి ధరమ్ తేజ్ హీరోగా 2015లో 'సుబ్రమణ్యం ఫర్ సేల్' సినిమాని తీసి విజయాన్ని అందుకున్నాడు. అలాగే 2017లో అల్లు అర్జున్ హీరోగా 'దువ్వాడ జగన్నాథం' లాంటి మాస్ ఎంటెర్టైనర్ తెరకెక్కించాడు. ఆ సినిమా బన్నీ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల జాబితాలో నిలిచింది. ఇప్పుడు మెగా ప్రిన్స్ హీరోగా 'గద్దలకొండ గణేష్' చిత్రాన్ని తీశారు. ఈ చిత్రం ఈరోజే విడుదలై మాస్ ప్రేక్షకుల్లో మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అభిమానులైతే హిట్ ఖాయమని అంటున్నారు. ఇక ఇప్పటివరకు డిఫరెంట్ జోనర్స్లో, విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్న వరుణ్తేజ్ ఈ సినిమాలో కూడా మరో డిఫరెంట్ క్యారెక్టర్ తో మెప్పించాడు. అలాగే హరీష్ శంకర్ రాసిన కామెడీ కూడా సినిమాలో బాగా హైలెట్ అయింది. ప్రముఖ తమిళ్ యంగ్ హీరో అధర్వ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో అద్భుతంగా నటించాడు. వీరితో పాటు పూజా హెగ్డే, మృణాలిని రవి కీలక పాత్రల్లో చాల బాగా నటించారు. ప్రముఖ నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు.