భారత ప్రగతికి ప్రవాస భారతీయులు తమ నైపుణ్యాన్ని సోపానాలుగా మలచాలని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పిలుపునిచ్చారు. బెంగళూరులో సోమవారం జరిగిన 14వ ప్రవాస భారతీయ దివస్‌ ముగింపు ఉత్సవంలో ఆయన ప్రసంగించారు. ప్రవాస భారŒతీయులు.. మరీ ముఖ్యంగా గల్ఫ్‌లో ఇబ్బందుల పాలవుతున్న వారిని కష్ట కాలాల్లో ఆదుకునేందుకు భారత ప్రభుత్వానికి తోడుగా నిలవాలని అక్కడివారిని రాష్ట్రపతి కోరారు. ప్రవాస భారతీయులు తమకు నీడనిచ్చే దేశ ప్రగతికి శ్రమిస్తూనే, తామూ పేరు ప్రఖ్యాతులను గడిస్తుండటం సంతోషదాయకమని చెప్పారు. వీరంతా మన దేశానికి 2015లో 69 బిలియను డాలర్ల నగదును పంపి దేశ పురోగతికి తోడ్పడ్డారని వివరించారు.



తాత్కాలిక ప్రాతిపదికన విదేశాల్లో పనిచేస్తున్న వారు తమ వృత్తుల్లో ఎదుర్కొంటున్న నైపుణ్య లోపాలను భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు. మన దేశ యువత వృత్తి, సాంకేతిక విద్యలో అత్యున్నత ప్రమాణాలను సాధించేందుకు వారి అండదండలు అవసరమన్నారు. మేక్‌ ఇన్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియా, స్వచ్ఛభారత్‌ తదితర కార్యక్రమాలకూ ఇతోధికంగా చేయూతనివ్వాలని కోరారు. అంతకుముందు 2014-15లో విదేశాల్లో ప్రధాని మోదీ భారత విదేశాంగ విధానంపై చేసిన ప్రసంగాలున్న పుస్తకాలను రాష్ట్రపతి ఆవిష్కరించారు. వివిధ రంగాల్లో కృషి చేసిన 30మంది ప్రవాస భారతీయులకు ప్రవాస భారతీయ సమ్మాన్‌ పురస్కారాలను ప్రదానం చేశారు. తొలి పురస్కారాన్ని పోర్చుగల్‌ ప్రధాని డాక్టర్‌ అంటోనియో కోస్తాకు అందించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: