ప్రముఖ సాహస యాత్రికుడు బేర్ గ్రిల్స్ తో కలిసి భారత ప్రధాని నరేంద్ర మోదీ మొదటి సారి ఉత్తర ఖాండ్ లోని జిమ్ కార్పెట్ జాతీయ పార్క్ లో సాహస యాత్ర లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ యాత్ర ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ప్రఖ్యాత టెలివిజన్ షో మ్యాన్ వర్సెస్ వైల్డ్ కార్యక్రమంలో భాగంగా ఈ సాహస యాత్ర ను చిత్రీకరించారు. ఈయాత్ర లో పులులు , మొసళ్ళు , అలాగే విష సర్పాల మధ్య లో ఎలా మనుగడ సాధించాలో బేర్ గ్రిల్స్ ,మోదీ కి వివరించాడు. అలాగే మోదీ కూడా తన బాల్యం ,రాజకీయ జీవితం గురించిన ఆసక్తికర విషయాలను బేర్ గ్రిల్స్తో పంచుకున్నారు.
ఇక ఈ సాహస యాత్ర ను డిస్కవరీ ఛానెల్ ఈనెల 12 న 180 దేశాల్లో ప్రసారం చేయగా.. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యంత ట్రెండింగ్ టెలివిజన్ ఈవెంట్ అనే హోదాను సాధించింది. అలాగే ఈ సాహస యాత్రకు ఇప్పటివరకు సామాజిక మాధ్యమం ట్విట్టర్ లో 3.6 బిలియన్ ఇంప్రెషన్స్ వచ్చాయి. ఇప్పటివరకు ఇదే అత్యధికం. ఇంతకుముందు సూపర్ బౌల్ 53 అనే కార్యక్రమానికి 3.4 బిలియన్ సోషల్ ఇంప్రెషన్స్ వచ్చాయి.
కాగా పర్యావరణంలో వస్తున్న మార్పులను, వన్యప్రాణుల సంరక్షణ ఆవశ్యకతను తెలియజెప్పడం ఈ షో ముఖ్య ఉద్దేశమని డిస్కవరీ చానల్ వెల్లడించింది. ఇక తనకు ఈఅవకాశం కల్పించిన బేర్ గ్రిల్స్ కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. చిన్నప్పటి నుండి అడవులు , కొండల మధ్య గడిపానని ఈ కార్యక్రమం ద్వారా పర్యావరణ గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియపర్చవచ్చని భావించానని మోదీ పేర్కొనగా.. ప్రపంచలోనే గొప్ప నాయకుడి తో కలిసి సాహస యాత్ర లో పాల్గొనడం గొప్ప ఆనందాన్ని ఇచ్చిందని బేర్ గ్రిల్స్ తెలిపారు.