ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ అనే సంస్థ ఒకటుందని తెలుసు కదా.. ఇదే సంస్థ గతంలో అనేక దిమ్మతిరిగే కథనాలు అందించింది. ప్రపంచంలోని అక్రమాలను వెలికి తీయడమే ఈ ఐసీఐజే పని.. గతంలో లక్స్ లీక్స్, స్విస్ లీక్స్, పనామా పేపర్స్, పారడైజ్ పేపర్స్ అంటూ అనేక కుంభకోణాలను బయటపెట్టింది ఈ జర్నలిస్టులే.. ఈ ఐసీఐజేలో 88 దేశాలకు చెందిన 110 వార్తా సంస్థలు సభ్యులుగా ఉన్నాయి. ఇప్పుడు తాజాగా 1999-2017 మధ్యలో బ్యాంక్ల ద్వారా చేతులు మారిన అక్రమ సొమ్ము వివరాలను వెల్లడించారు.
హెచ్ఎస్బీసీ, డాయిష్ సహా పలు అంతర్జాతీయ బ్యాంకుల్లో జరిగిన అక్రమ లావాదేవీల గురించి సమస్త సమాచారాన్ని ఈ జర్నలిస్టుల సంస్థ బయటపెట్టింది. ఇలాంటి అక్రమ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఇదే అతిపెద్ద డేటా లీక్ అని చెబుతున్నారు. ఈ డాటా ప్రకారం 1997-2017 మధ్యకాలంలో ప్రపంచ దేశాల్లోని పలు బ్యాంక్ల ద్వారా 2 లక్షల కోట్ల డాలర్లకు పైగా అంటే మన కరెసన్నీ లెక్కల్లో దాదాపు రూ.150 లక్షల కోట్లు పైగా చట్ట విరుద్ధ సొమ్ము చేతులు మారిందట.
మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే.. భారత బ్యాంక్ల ద్వారా కూడా ఇందులో కొన్ని లావాదేవీలు జరిగాయట. ఇండియా విషయానికి వస్తే.. ఎస్బీఐ సహా దేశంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్, విదేశీ బ్యాంకుల ద్వారా 406 లావాదేవీలు జరిగినట్లు ఈ సంస్థ గుర్తించింది. ఇండియాలో 2000-17 మధ్య కాలంలో బదిలీ అయిన అనుమానాస్పద సొమ్ము రూ. 3,616 కోట్ల వరకూ ఉంటుందట.