మన దేశంలో కరోనా టీకాల ప్రక్రియ మెల్లగా సాగుతోంది. టీకాలు ఉచితంగా వేస్తున్నా..ఆ ప్రక్రియ బాగా ఆలస్యంగా జరుగుతోంది. ప్రస్తుతం ఇండియాలో ప్రస్తుతం 18ఏళ్లు పైబడిన వారికి మాత్రమే టీకా ప్రక్రియ కొనసాగుతోంది. ఇండియాలో దాదాపు 130 కోట్ల జనాభా ఉంటే.. ఇంకా కనీసం 50 కోట్ల మందికి కూడా ఒక్కడోసు అందలేదు. ఇలాగైతే ఇక దేశం మొత్తం వ్యాక్సినేషన్ ఎప్పుడు పూర్తవుతుందన్న అసంతృప్తి జనంలో కనిపిస్తోంది. అయితే కేంద్రం వ్యాక్సీన్ వేసే దాకా చేసేది కూడా ఏమీ లేదు.


ఇక పెద్దల పరిస్థితి ఇలా ఉంటే.. పిల్లల సంగతి మరీ దారుణం. అసలు ఇండియాలో ఇప్పటి వరకూ పిల్లల వ్యాక్సీన్ అందుబాటులోకి రానే లేదు. పాశ్చాత్య దేశాల్లో పిల్లలకు కూడా వ్యాక్సిన్ అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎయిమ్స్‌ చీఫ్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా ఓ గుడ్ న్యూస్ చెప్పేశారు. సెప్టెంబరులోపే పిల్లలకు కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులో వచ్చే అవకాశాలున్నాయని ఆయన మీడియాకు తెలిపారు. గుజరాత్‌ ఫార్మా సంస్థ జైడస్‌ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్‌-డీ త్వరలోనే పిల్లలకు అందుబాటులోకి రాబోతోందని ఆయన తెలిపారు.


ఈ జైకోవ్ డీ ప్రపంచంలోనే డీఎన్‌ఏ ఆధారంగా తయారైన తొలి కొవిడ్‌ టీకా అని చెప్పొచ్చు. జులై 1న ఈ కంపెనీ అత్యవసర అనుమతుల కోసం అప్లయ్ చేసుకుంది. ఈ టీకాను 12 ఏళ్లకు పైబడిన వారికి ఇవ్వొచ్చు. ఇప్పటికే ఈ టీకాను చిన్నారులపై ప్రయోగించి చూశారు. డీసీజీఐ అనుమతి వస్తే ఇక ప్రోడక్షన్ ప్రారంభించడమే అంటోందీ కంపెనీ. పిల్లలపై కొవాగ్జిన్‌ ట్రయిల్స్‌ సైతం త్వరలోనే పూర్తి కాబోతున్నాయట. ఇప్పటి వరకూ  ఇండియాలోనూ 12 ఏళ్లలోపు పిల్లలకు అమెరికా వ్యాక్సిన్లు ఫైజర్‌, మోడెర్నా వేసేందుకు అనుమతి వచ్చేసింది.


కోవాగ్జిన్ ట్రయల్స్‌ కూడా పూర్తి కాబోతున్నాయి. 12-18 ఏళ్లు, 6-12 ఏళ్లు మధ్య పిల్లలకు రెండు డోసుల వ్యాక్సీన్ ప్రయోగం పూర్తయిందట. ఇప్పటికే 2-6 ఏళ్ల మధ్య చిన్నారులకు తొలిడోసు టీకా ఇచ్చేశారు. రెండో డోసు టీకా త్వరలో ఇస్తారట. మొత్తానికి సెప్టెంబర్‌లోపే పిల్లకు వ్యాక్సీన్ వస్తుందని నిపుణలు కుండబద్దలు కొడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: