అంతే కాదు.. ఈ మొత్తంలో 55 వేల కోట్ల రూపాయల మొత్తాన్ని రుణాల ద్వారా సమీకరించనున్నట్లు మంత్రి బుగ్గన తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఆ సమయంలోనే రాష్ట్రానికి ఉన్న అప్పుల గురించి బుగ్గన ప్రసంగంలో తెలిపారు. ఆయన ఏమంటున్నారంటే.. 2021-22 సవరించిన అంచనాల ప్రకారం 3 లక్షల 90 వేల 670 కోట్లుగా రాష్ట్ర అప్పు ఉందట. అది కాస్తా 2022-23 ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే సరికి 4 లక్షల 39వేల 394 కోట్ల రూపాయలకు పెరుగుతుందట. ఇది అంచనా మాత్రమేనట. అంతే కాదు.. ఈ అప్పులు కాకుండా 2021 డిసెంబర్ 31 వరకు వివిధ ప్రభుత్వరంగ సంస్థలు తీసుకున్న లక్షా 17 వేల 503 కోట్ల రూపాయల రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీగా ఉందట.
అంతే కాదు.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి వడ్డీల రూపంలో 21 వేల 805 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందట. అంటే అటూ ఇటూగా రాష్ట్రానికి ఉన్న అప్పు నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు ఉందన్నమాట. అయితే అప్పుల విషయంలో ఎన్నో విషయాలు చెప్పిన ఆర్థిక మంత్రి బుగ్గన.. వాటిని తీర్చే మార్గం గురించి మాత్రం ఏమీ చెప్పలేదు.. అంటే అప్పులు ఉండటం కామన్.. వడ్డీలు కట్టుకుంటూ పోవడం అంత కంటే కామన్ అన్నట్టుగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం తీరు.. గతంలో టీడీపీ సర్కారు అంతే.. ఇప్పుడు జగన్ సర్కారూ అంతే..