జగన్ సర్కారుపై విపక్షాలు చేస్తున్న ప్రధాన ఆరోపణ.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో జగన్ దింపేస్తున్నారని.. ఇప్పుడు ఈ విషయం గురించి బడ్జెట్‌ ప్రసంగం సమయంలో కొన్ని అంశాలను రాష్ట్ర ప్రభుత్వమే క్లారిటీ ఇచ్చింది. బడ్జెట్ ప్రసంగంలో అప్పుల గురించి వచ్చిన ప్రస్తావన ఈ అంశాలను వివరిస్తోంది. సంక్షేమ పథకాలకు ప్రాధాన్యమిస్తున్నామంటూ ఆర్థికమంత్రి బుగ్గన మొత్తం 2 లక్షల 56 వేల 257 కోట్ల రూపాయలతో బడ్జెట్‌ను ప్రతిపాదించారు. అయితే ఇందులో  17 వేల 36 కోట్ల రెవెన్యూ లోటు, 48 వేల 724 కోట్ల ద్రవ్యలోటు ఉన్నట్లు ఆయనే వివరించారు.


అంతే కాదు.. ఈ మొత్తంలో 55 వేల కోట్ల రూపాయల మొత్తాన్ని రుణాల ద్వారా సమీకరించనున్నట్లు మంత్రి బుగ్గన తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఆ సమయంలోనే రాష్ట్రానికి ఉన్న అప్పుల గురించి బుగ్గన ప్రసంగంలో తెలిపారు. ఆయన ఏమంటున్నారంటే.. 2021-22 సవరించిన అంచనాల ప్రకారం 3 లక్షల 90 వేల 670 కోట్లుగా రాష్ట్ర అప్పు ఉందట. అది కాస్తా  2022-23 ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే సరికి 4 లక్షల 39వేల 394 కోట్ల రూపాయలకు పెరుగుతుందట. ఇది అంచనా మాత్రమేనట. అంతే కాదు.. ఈ అప్పులు కాకుండా 2021 డిసెంబర్‌ 31 వరకు వివిధ ప్రభుత్వరంగ సంస్థలు తీసుకున్న లక్షా 17 వేల 503 కోట్ల రూపాయల రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీగా ఉందట.


అంతే కాదు.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి వడ్డీల రూపంలో 21 వేల 805 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం  చెల్లించాల్సి ఉంటుందట. అంటే అటూ ఇటూగా రాష్ట్రానికి ఉన్న అప్పు నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు ఉందన్నమాట. అయితే అప్పుల విషయంలో ఎన్నో విషయాలు చెప్పిన ఆర్థిక మంత్రి బుగ్గన.. వాటిని తీర్చే మార్గం గురించి మాత్రం ఏమీ చెప్పలేదు.. అంటే అప్పులు ఉండటం కామన్‌.. వడ్డీలు కట్టుకుంటూ పోవడం అంత కంటే కామన్ అన్నట్టుగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం తీరు.. గతంలో టీడీపీ సర్కారు అంతే.. ఇప్పుడు జగన్ సర్కారూ అంతే..

మరింత సమాచారం తెలుసుకోండి: