తెలంగాణ సీఎం కేసీఆర్ కు వ్యవసాయంపై ప్రేమ ఎక్కువ. ఎపుడూ రైతుల సంక్షేమం కోసం కొత్తకొత్త ప్రణాళికలు రూపొందిస్తుంటారు. అందులో భాగంగానే ఓ ప్లాన్ వేశారు. రైతులు వ్యవసాయంలో లాభాలు అర్జించే విధంగా కొత్త విధానానికి శ్రీకారం చుడుతున్నారు.
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా...సమగ్ర వ్యవసాయ విధానంపై దృష్టి పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఇకపై రైతులు ఏ పంట వేయాలనేది ప్రభుత్వమే నిర్ణయించనుంది. మార్కెట్లో డిమాండ్కు తగ్గ పంట సాగయ్యేలా చర్యలు తీసుకోబోతోంది.
తెలంగాణలో పంట సాగు విధానం మార్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. సమగ్ర వ్యవసాయ విధానానికి రూపకల్పన చేసేందుకు అధికారులతో సమాలోచనలు జరుపుతున్నారు ముఖ్యమంత్రి. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే అంశంపై సుదీర్ఘ కసరత్తు జరుపుతున్నారు. ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా, మార్కెట్లో డిమాండ్ ఉండే పంటలు పండించేలా రైతుల్లో మార్పు తేవాలని ఆదేశించారు ముఖ్యమంత్రి కేసీఆర్.
రైతులు ఒకే పంట వేసి నష్టపోకుండా, ప్రత్యామ్నాయంపై వెళ్లేలా ప్రణాళిక తయారూ చేయాలని అధికారులకు సూచించారు సీఎం. వాటిని రైతులకు వివరించి, వ్యవసాయ విధానంలో మార్పులు తీసుకురావాలన్నారు. రైతులు ఏ పంటలు వేయాలనేది ప్రభుత్వమే నిర్ణయించాలన్నారు. పండించిన పంటకు కనీస మద్దతు ధర వచ్చేలా ప్రభుత్వమే ఏర్పాట్లు చేస్తుందని స్పష్టం చేశారు.
మరోవైపు ప్రభుత్వం సూచించిన పంట వేయని రైతులకు రైతుబంధు సాయం నిలిపేయాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం మందు ఉంచారు నిపుణులు. ఆయా పంటల్ని కూడా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయకూడదన్నది వారి మాట. ఇదే సమయంలో ప్రభుత్వం సూచించిన పంటలకు సంబంధించిన విత్తనాలే.. విత్తన కంపెనీలు అమ్మాలని... ఏవి పడితే అవి రైతులకు అంటగట్టే విధానాలు పోవాలన్నది వారి సలహా.
అలాగే ఏఏ పంట ఎంతెంత మేర సాగుచేయాలో కూడా సూచనలు చేశారు. త్వరలోనే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణ సమగ్ర వ్యవసాయ విధానంపై చర్చించనున్నారు సీఎం కేసీఆర్.