హైకోర్టు తీర్పులను కవర్ చేసే టీవీ ఛానల్ జర్నలిస్టులకు చాలా తలనొప్పులు ఉంటాయి. తీర్పులు వెంటనే రావు.. తీర్పు వచ్చినా దాని సారాంశం ఏంటో అర్థం చేసుకోవాలంటే కాస్త సమయం పడుతుంది. ఈలోపే పక్క ఛానల్ వాడు బ్రేకింగుల మీద బ్రేకింగులు వేస్తుంటాడు.
ఇలాంటి వాళ్ల ద్వారానే కోర్టు తీర్పులు ముందుగా ప్రపంచానికి తెలుస్తాయి. ఆ తర్వాత తీరిగ్గా తీర్పు కాపీ వచ్చాక పత్రికల వాళ్లు సమగ్రంగా సుదీర్ఘంగా విషయం చెబుతారు. అయితే ఇక్కడ తమాషా ఏంటంటే.. పిల్లలు పరీక్ష పేపర్లు లీకైనట్టు.. కోర్టు తీర్పులు కూడా లీకవుతున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. హైకోర్టు ఇచ్చే తీర్పుల విషయంలో తెలుగు దేశం చాలా ముందుంటుందని వైసీపీ నేతలే అంగీకరిస్తున్నారు. అసలు హైకోర్టు ఇచ్చే తీర్పు పది నిమిషాల ముందే చంద్రబాబుకు తెలుస్తుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ముందుగా చంద్రబాబును విచారించాలని... ఆయన కాల్ లిస్టు బయటపెట్టాలని వైయస్ఆర్ కాంగ్రెస్పార్టీ ఎంపీ నందిగం సురేష్ డిమాండ్ చేశారు. ఇది నిజంగా సంచలనమైన ఆరోపణే. ఈ ఆరోపణ చంద్రబాబును ఉద్దేశించి అన్నట్టు కనిపించినా... కోర్టులకూ ఇందులో భాగస్వామ్యం ఉన్నట్టు ఆయన ఆరోపించారా అనిపించకమానదు. నందిగం సురేశ్ ఇంకా ఏమన్నారంటే.. " ఈ రోజున పది మంది టీడీపీ దళిత నేతలు పరిగెత్తుకొచ్చి దళితుల ఆత్మగౌరవం దెబ్బతిన్నది అని మాట్లాడుతున్నారు. వెనక్కు తిరిగి చూస్తే.. చంద్రబాబు దళితులపై ఏం మాట్లాడారో.. వారికే అర్థం అవుతుంది. దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని చంద్రబాబు.. దళితులు చదువుకోరని, శుభ్రంగా ఉండరని మరికొంతమంది టీడీపీ వారే మాట్లాడారు. ఇవన్నీ మర్చిపోయి దళితుల ఆత్మగౌరవం దెబ్బతిన్నదని టీడీపీలోని దళితులే మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు ఎంపీ సురేష్.
40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు దళితులకు ఏం చేశాడో కూడా చెప్పుకోవడానికి ఒక్క కార్యక్రమం లేదని నందిగం సురేష్ ఆరోపించారు. ఎంతసేపూ మేనేజ్మెంట్లతోనే ఒడ్డు ఎక్కే చంద్రబాబు 26 కేసుల్లో స్టేలు తెచ్చుకున్నాడని వ్యాఖ్యానించారు.