టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించారు. సందర్శన అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ మంత్రులు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని... ప్రజల ఆరోగ్యం మీద మాట్లాడమంటే కాంగ్రెస్ పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. మంత్రులకు సిగ్గులేదని... ఉస్మానియా ఆస్పత్రిలో భవనాల ఫ్లోరింగ్ ఎలా ఉందో అధికార పార్టీ నేతలు చూడాలని అన్నారు.
మంత్రులు ఎన్నికల సమయంలో ఏం మాట్లాడారో ఒకసారి గుర్తు చేసుకోవాలని... అద్భుతమైన బిల్డింగ్ నిజం హయాంలో కడితే టీఆర్ఎస్ సర్కార్ ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని విమర్శలు చేశారు. నిజాం కట్టిన భవనాలను కూల్చే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని అన్నారు. హెరిటేజ్ భవనాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని.... ఉస్మానియా ఆవరణలో 6 ఎకరాల స్థలం ఉంది కావున అక్కడే కొత్త భవనాలను కట్టాలని చెప్పారు.
ఉస్మానియా భవనం కూలిపోయే దశలో ఉందని... ఆసుపత్రి ఆందోళనకర పరిస్థితిలో ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్పిటల్ సూపరిండెంట్ 500 కోట్ల రూపాయల బడ్జెట్తో ఉస్మానియా ఆసుపత్రిని కొత్త ప్రణాళికతో నిర్మించాలని సూచించినా అది ఆచరణ రూపం దాల్చడం లేదని.. అద్భుతమైన సచివాలయాన్ని మూడనమ్మకాల కోసం కూలగొట్టడం దారుణం అని అన్నారు.
గత ఏడేళ్లలో ఉస్మానియా కోసం కేసీఆర్ ప్రభుత్వం రూ.ఏడు కూడా ఖర్చు చేయలేదని.... నిజాం కట్టడాలను ధ్వంసం చేయడం మానేసి అవసరమైతే దీన్ని మ్యూజియం చేయాలని సూచనలు చేశారు. ప్రజల ప్రాణాలంటే కేసీఆర్ కు లెక్క లేదని... రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు, మరణాలు పెరిగేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కరోనా సామాజిక వ్యాప్తి దశకు చేరడానికి కేసీఆర్ అసమర్థతే కారణమని అన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి