ఈ నేపథ్యంలో తన పార్టీ ఎంపీ దారితప్పి.. తనమీదే విమర్శలకు దిగడంతో జగన్ సీఐడీతో చర్యలకు దిగారు. అయితే.. ఈ విషయంలో నిజానిజాలు.. వాస్తవాలు.. నిగ్గు తేల్చేందుకు తప్పు చేసిన వారిని దండించేందుకు కోర్టులు రెడీగా ఉన్నాయి. కానీ, తనది కాని వ్యవహారంలో చంద్రబాబు.. ఆయన టీం జోక్యం చేసుకుని.. రఘును తమకు ఓన్ చేసుకున్నారు. అయితే.. ఇది మరింతగా వివాదాన్ని రాజేస్తుందని.. అంటున్నారు పరిశీలకులు. రఘురామ రాజు.. సీఎంపైనా.. వైసీపీ నేతలపై నా చేసిన విమర్శలు.. పెట్టిన వీడియోల వెనుక టీడీపీ నేతలు ఉన్నారని. ముఖ్యంగా చంద్రబాబు హస్తం ఉందనేది వైసీపీ ఆరోపణ.
అయితే.. ఈ విషయంలో ఇప్పటి వరకు టీడీపీ నేతలు మౌనంగానే ఉన్నారు. ఎక్కడా నోరు విప్పలేదు. కానీ, ఇప్పుడు చంద్రబాబు సహా ఆయన తనయుడు లోకేష్, అచ్చెన్నాయుడు.. అయ్యన్నపాత్రుడు.. ఇలా ప్రతి ఒక్కరూ మీడియా ముందుకు వచ్చి రఘుకు సానుకూలంగా మాట్లాడారు. అంటే.. దీనిని బట్టి ఇప్పటి వరకు రఘును ఆడించింది.. మీడియాలో హైలెట్ చేయించింది కూడా చంద్రబాబేననే విషయం స్పష్టంగా తెలుస్తోందని.. వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో రఘుకు తెరచాటున ఉండి సాయం చేసిన `తెలుగు వీరు`లను కూడా అరెస్టు చేయించే ప్రక్రియ కొనసాగుతోంది. అంటే.. ఇప్పుడు అటు తిరిగి.. ఇటు తిరిగి.. మళ్లీ టీడీపీ నేతలకు ఉచ్చు బిగుసుకుంటోందన్నమాట..!