అయితే.. పట్టాభి అరెస్టును ఆయన ముందే ఊహించారు. అందుకు పట్టాభి ప్రిపేర్గానే ఉన్నారు. పట్టాభి ఎంతగా ప్రిపేర్ అయ్యారంటే.. పోలీసులు అరెస్టు చేస్తే తనను ఎలాగూ చితక్కొట్టుడు కొడతారని ఆయన ముందే ఊహించారు. అందుకే ముందు జాగ్రత్తగా ఓ వీడియో మీడియాకు విడుదల చేశారు. పోలీసులు కస్టడీలోకి తీసుకున్న తర్వాత తనకు ఏం జరిగినా సీఎం జగన్, డీజీపీ గౌతమ్ సవాంగ్దే బాధ్యత అని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఆ వీడియోలో స్పష్టం చేశారు.
ప్రస్తుతం తన ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని, పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని పట్టాభి వీడియో ద్వారా మీడియాకు చెప్పారు. అంతే కాదు.. మీడియాకు తన కాళ్లు, పొట్ట, వీపు అన్నీ చూపించారు. కేవలం ఓ షార్ట్, షర్ట్ ధరించిన పట్టాభి.. తన అరికాళ్ల దగ్గర నుంచి.. తొడలు.. పొట్ట, వీపు, చేతులు, చేతివేళ్లు అన్నీ చూపించారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా టీడీపీ తరఫున తాను పోరాడుతున్నందుకే పోలీసులు తనపై కక్షగట్టారని పట్టాభి ఆ వీడియోలో తెలిపారు.
పోలీసులు తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించిన పట్టాభి.. సోమవారం సాయంత్రం కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసి, ఇంట్లోని ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేశారని గుర్తు చేశారు. ఆ ఘటనకు కారణమైన నిందితులను ఇప్పటికీ పట్టుకోలేదని.. కానీ ఇప్పుడు తనను అరెస్టు చేయడం ఏమేరకు సబబో రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని పట్టాభి అంటున్నారు. ఎంపీ రఘురామకృష్ణరాజుపై దాడి చేసిన విధంగానే తనపైనా దాడి చేయాలని పోలీసులు చూస్తున్నారని పట్టాభి ఆరోపించారు. అందుకే.. ఈ వీడియో చేస్తున్నానని పట్టాభి వివరించారు.