అయితే, గతంలో కొండ ప్రాంతాల్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాద ఘటనల్లో ఏ ఒక్కరూ కూడా క్షేమంగా బయటపడలేదు.. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ ప్రాంతాలు ఎంత ప్రమాదకరంగా ఉంటాయో. ఎందుకంటే చెట్లు, ఎత్తైన కొండలు కారణంగా ఎప్పుడు ఏ ప్రమాదం పొంచి ఉందో అస్సలు ఊహించలేం. ఒకవేళ ఏదైన ప్రమాదం జరిగి హెలికాప్టర్ కుప్పకూలితే.. సహాయ బృందాలు, ఎమర్జెన్సీ బృందాలు అక్కడికి చేరుకోవడం కాస్త కష్టతరమైన ప్రక్రియ.. దీంతో ప్రమాదానికి గురైన వారికి సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లలేకపోవడంతో మరణించే అవకాశాలు ఎక్కువగా సంభవించాయి.
ముంబయి సమీపంలో 1993 జులై 15న జెండా తెక్రీ హిల్టాప్లోని తలోజా గ్రామం ప్రాంతంలో కొండను హెలికాప్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. అహ్మదాబాద్ నుంచి ముంబయి వైపు వస్తున్న హెలికాప్టర్కు ప్రమాదం సంభవించింది. 4 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎయిర్ట్రాఫిక్ కమ్యూనికేషన్ ను కోల్పోయింది. దీంతో అదుపుతప్పిన హెలికాప్టర్ కొండను ఢీ కొనడంతో ప్రమాదం సంభవించింది. విచారణ నివేదికలో పైలట్ సమన్వయం చేసుకోలేకపోవడం, రాడార్ కంట్రోలర్ కూడా అప్రమత్తంగా లేకపోవడం కారణంగానే ప్రమాదం సంభవించిందని పేర్కొంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ కూడా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంఘటన నుంచి ఇంకా ఆయన అభిమానులు తేరుకోలేదు. 2009 సెప్టెంబర్ 2న చోటు చేసుకున్న ఈ ఘటనలో వైఎస్సార్తో పాటు మొత్తం ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు. కర్నూలు జిల్లా ఆత్మకూరుకు 26 కి.మీ దూరంలో ఉన్న రుద్రకోడు కొండను ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది.