
ఫుల్ స్పీడ్ టూర్ – ఫుల్ పవర్ ప్రజంటేషన్! .. జూలై 26 నుంచి 30వ తేదీ వరకు సింగపూర్లో నాన్స్టాప్ సమావేశాలు, భేటీలతో చంద్రబాబు బృందం చుట్టేశారు. సింగపూర్ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నం, మాజీ ప్రధాని లీ సైన్ లూంగ్, వాణిజ్య, పరిశ్రమల శాఖామంత్రి టాన్ సీ లెంగ్, హోం శాఖ మంత్రి షణ్ముగం లాంటి కీలక నేతలతో భేటీ అయ్యారు. అంతేకాదు, పలు ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులతో సమావేశమై ఏపీలో పెట్టుబడి అవకాశాలపై ప్రజంటేషన్ ఇచ్చారు. ఏపీకే టాక్ ఆఫ్ ద సిటీ! .. సుర్బానా జురాంగ్, కేపెల్, కాపిటాల్యాండ్, సెంబ్ కార్ప్, TVS మోటార్స్, అదానీ పోర్ట్స్ వంటి దిగ్గజ సంస్థలు సీఎం బృందాన్ని కలిశాయి. ఏపీ ప్రభుత్వ ప్రోత్సాహక విధానాలు, స్పష్టమైన విజన్, వృద్ధి అవకాశాలు అన్నీ వారి ముందు సాక్షాత్కారం అయ్యాయి. ముఖ్యమంత్రి బృందం ఇచ్చిన ప్రజంటేషన్ పట్ల సానుకూల స్పందన కనిపించిందని విశ్లేషకులు చెబుతున్నారు.
విశాఖలో గ్రాండ్ షో? .. నవంబర్ 14–15 తేదీల్లో విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సుకు సింగపూర్ ప్రతినిధులను ఆహ్వానించిన సీఎం .. ఈ టూర్ ఫలితాలను అక్కడే ప్రకటించే అవకాశముంది. ఎంతమంది పెట్టుబడిదారులు ఏఏ రంగాల్లో ముందుకు వస్తారు అన్నది చూడాల్సిందే కానీ, ఓ మేటి టూర్గా ఈ సింగపూర్ ప్రయాణం గుర్తుండిపోతుందని విశ్లేషణలు చెబుతున్నాయి.అమరావతి ఆశలు.. సింగపూర్ నెపధ్యం! .. ఒకప్పుడు కలల రాజధానిగా ప్రారంభమైన అమరావతిని మరోసారి అద్భుతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో చంద్రబాబు చేస్తున్న ఈ చొరవ, ఏపీ భవిష్యత్పై భారీ ఆశలను కలిగిస్తోంది. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే – "సింగపూర్ సపోర్ట్ ఎంత వరకూ వస్తుంది?"