తిరుమలలో కొలువై యున్న శ్రీనివాస మహా ప్రభువును తమ ఇష్టానుసారం దర్శించుకోవడం ఇక సామాన్యులకు కుదరదు. దర్శనానికి వచ్చే భక్తుల పై  ఆంక్షలను మరింత కఠినం చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం మరోసారి ప్రకటించింది. ఇంతకీ ఏమిటా నిబంధనలు ?
కోవిడ్ వ్యాక్సినేష‌న్ లేదా నెగెటివ్ సర్టిఫికెట్ ఉంటేనే భక్తులను తిరుమ‌ల‌కు అనుమ‌తిస్తారని టిటిడి ప్రకటించింది. తిరుమ‌లని దేవదేవుని ద‌ర్శ‌నానికి వ‌చ్చే భ‌క్తులు వ్యాక్సినేష‌న్ సర్టిఫికేట్ కానీ, దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్‌టిపిసిఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికేట్ కానీ త‌ప్ప‌నిస‌రిగా తీసుకురావాల‌ని తిరుమల తిరుపతి దేవస్థానం మ‌రోక‌సారి భ‌క్తుల‌కు తెలిపింది. ఇదివ‌ర‌కే టిటిడి ఈ విష‌యాన్ని ప‌లు మార్లు తెలియ‌జేసిన విష‌యాన్ని మరోసారి గుర్తు చేసింది.

         ప‌లువురు భ‌క్తులునెగిటివ్ సర్టిఫికేట్ లేకుండా నామాల స్వామి ద‌ర్శ‌నం కోసం వ‌స్తుండ‌డంతో అలిపిరి చెక్ పాయింట్ వ‌ద్ద సిబ్బంది త‌నిఖీ చేసి వెన‌క్కు పంపుతున్నారు. దీనివ‌ల‌న అనేక భ‌క్తులు ఇబ్బందికి గురి అవుతున్నారు. ఇటీవ‌ల కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు కోవిడ్ - 19 మూడ‌వ వేవ్ ఒమిక్రాన్ రూపంలో దేశ వ్యాప్తంగా విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఖ‌చ్చితంగా వ్యాక్సినేష‌న్ సర్టిఫికేట్ కానీ, దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్‌టిపిసిఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికేట్‌ను అలిపిరి చెక్ పాయింట్ వ‌ద్ద చూపించిన వారిని మాత్ర‌మే తిరుమ‌ల‌కు అనుమ‌తిస్తారని టిటిడి ప్రకటించింది.  తాజా నిబంధనలను అమలు చేయడానికి అలిపిరి చెక్ పాయింట్ వద్ద మరింత పెద్ద సంఖ్యలో సిబ్బంది నియమించారు. ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని భక్తులు టిటిడికి స‌హ‌క‌రించాల‌ని  దేవస్థానం పాలక మండలి కోరింది.  ఇటీవల టిటిడి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో కోవిడ్-19 బారిన పడుతున్నారు. వీరి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అదేవిధంగా తిరుమల కు విచ్చేసే భక్తుల మూలంగా చిత్తూరు జిల్లాలోను కేసుల సంఖ్య అధికమవుతోంది. ఈ నేపథ్యంలో టిటిడి తాజాగా దర్శనం  నిబంధనలను మరింత కఠిన తరం చేసినట్లు టిటిడి వర్గాలు తెలిపాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

ttd