ఏపీ సీఎం జగన్‌కు ఆవేశం ఎక్కువ.. అనుభవం తక్కువ. ఈ విషయం ఇప్పటికే అనేక విషయాల్లో రుజువైంది. ఏపీ రాజధాని మార్పు నుంచి శాసన మండలి రద్దు వరకూ అనేక నిర్ణయాల విషయంలో జగన్‌కు ఎదురు దెబ్బలు తగిలాయి. అయితే.. ఏదైనా చేస్తేనే కదా కాస్త అనుభవం వచ్చేది అనే వారూ ఉన్నారు. కానీ.. ఏదైనా చేసే ముందు కాస్త ముందు వెనుక చూసుకుని.. నిపుణుల సలహాలు తీసుకుని ముందుకు వెళ్తే.. ఇంతగా బాధపడే అవసరం రాదు.


ఇందుకు మరో ఉదాహరణ దిశ చట్టం. ఏపీ సీఎం జగన్ అత్యాచారాల నివారణ కోసం.. నిందుతులకు సత్వరం శిక్ష పడేందుకు దిశ చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే.. ఈ చట్టాన్ని ఇంకా కేంద్రం ఆమోదించలేదు. అందుకే దిశ చట్టం రూపొందించినా అది ఇంకా అమల్లోకి రాలేదు. అయితే.. ఈ జగన్ సర్కారు చేసిన ఈ చట్టాన్ని మోడీ సర్కారు ఎందుకు అడ్డుకుంటోంది.. ఈ అంశంపై ఏలూరు రేంజి డీఐజీ పాలరాజు వివరణ ఇచ్చారు.


చట్టానికి ప్రత్యేకమైన పేరును పెట్టడంపై కేంద్రం అభ్యంతరం చెబుతోందని అందుకే ఏపీ రూపకల్పన చేసిన దిశాచట్టానికి ఆమోదం రాలేదని ఏలూరు రేంజి డీఐజీ పాలరాజు చెబుతున్నారు. దీనిపై కేంద్రాని రాష్ట్రం క్లారిఫికేషన్ పంపిందని వెల్లడించారు. మహిళలపై జరిగే నేరాలను అరికట్టేలా కేంద్రం నిర్భయ చట్టం కింద శిక్షలు వేస్తోందని దీనిప్రకారమే దిశను ఆమోదించాల్సిందిగా రాష్ట్రం కోరినట్టు తెలిపారు. సీఆర్ పీసీలో సవరణలపైనా కేంద్రం అభ్యంతరం చెబుతోందని దీనికి ఏపీ మళ్లీ వివరణ పంపించిందని ఏలూరు రేంజి డీఐజీ పాలరాజు తెలిపారు.


వాస్తవానికి శాంతి భద్రతల అంశం ఉమ్మడి జాబితాలో ఉంది. అందుకే కేంద్రం దిశ చట్టం పై అభ్యంతరాలు చెబుతోందని ఏలూరు రేంజి డీఐజీ పాలరాజు స్పష్టం చేశారు. కేంద్రం పరిధిలో ఉన్న అంశంపై రాష్ట్రం చట్టం చేయడాన్ని కేంద్రం సులభంగా అంగీకరించదు. ఏదో దశ ఎన్‌ కౌంటర్‌ సమయంలో అప్పట్లో మీడియాలో వచ్చిన కథనాల జోరుతో జగన్ దిశ చట్టం తీసుకొచ్చారు. చట్టం ఉద్దేశ్యం మంచిదే.. కానీ అదొక్కటే చట్టాల రూపకల్పనకు అమలుకు కారణం కాలేదు కదా. అదే ఇప్పుడు జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: