
ప్రమాణ స్వీకారం చేసిన సీఎం రేవంత్ రెడ్డి తొలిరోజే క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. అయితే విద్యుత్తు సంస్థలు రూ.85వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోవడం చూసి విస్మయం వ్యక్తం చేశారు. పూర్తి నివేదికలతో రావాలని ఆదేశించారు. వాస్తవానికి తెలంగాణలో వ్యవసాయానికి 24గంటల కరెంట్, గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.
గత పదేళ్లలో విద్యుత్తు సంస్థలు అప్పులు రూ.60వేల కోట్లకు పైగా పెరిగాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పులు ఊహింనంతగా పెరిగాయి. ప్రస్తుతం విద్యుత్తు సంస్థల అప్పులకే వడ్డీనే నెలకు రూ.1300 కోట్ల వరకు చెల్లించాల్సి వస్తోంది. ఈ పదేళ్లలో డిస్కంలు రూ.50వేల 275 కోట్ల నష్టాన్ని చవిచూశాయి.
ప్రస్తుతం కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందిస్తే ఆ భారం ఏకంగా ఏటా రూ.4008 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఖర్చులు భారీగా పెరిగిన నేపథ్యంలో ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ డిస్కంలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ఇప్పుడు మోదీ ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకువచ్చింది. పాత బకాయిలన్నీ తీర్చితేనే కేంద్రం నుంచి ఇచ్చే కరెంట్ సరఫరా చేస్తారు. భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మొత్తాన్ని చెల్లిస్తేనే కేంద్రం విద్యుత్తు సరఫరా చేస్తోంది. అయితే కాంగ్రెస్ హామీ మేరకు ఇప్పుడు సాగుకు, గృహ అవసరాలకు ఉచిత కరెంట్ ఇస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.