టాలీవుడ్ స్టార్ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా భీమ్లా నాయక్ మూవీ ద్వారా ప్రేక్షకాభిమానుల ముందుకు వచ్చి మంచి విజయం సొంతం చేసుకున్నారు. అంతకముందు వేణు శ్రీరామ్ తీసిన వకీల్ సాబ్ ద్వారా దాదాపుగా మూడేళ్ళ విరామం అనంతరం సినీ పరిశ్రమలోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవన్, దానితో కూడా సక్సెస్ కొట్టారు. ఇక లేటెస్ట్ గా ఆయన హరిహర వీరమల్లు అనే మూవీ చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా పెరియాడికల్ డ్రామా మూవీ గా తెరకెక్కుతుండగా ఇందులో వీరుమల్లు అనే గజదొంగ పాత్రలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనిపించనున్నట్లు టాక్.

ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ అందరి నుండి సూపర్ గా రెస్పాన్స్ సొంతం చేసుకుని సినిమాపై అందరిలో కూడా భారీ స్థాయిలో అంచనాలు పెంచింది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి జ్ఞానశేఖర్ ఫోటోగ్రఫి అందిస్తున్నారు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ త్వరలో తదుపరి షెడ్యూల్ జరుపుకోనున్నట్లు టాక్. అయితే విషయం ఏమిటంటే, త్వరలో ఈ మూవీ మిగతా పార్ట్ షూట్ మొత్తం పూర్తి చేసిన అనంతరం దసరా నుండి పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీని మరింతగా బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ అంతటా యాత్ర చేయనున్నారు. దానితో ఆయన ఆపైన అసలు సినిమాలు చేస్తారా లేదా అనేది అందరి మనసులో ప్రస్తుతం మెదులుతున్న ప్రశ్న.

మరోవైపు ఇప్పటికే హరీష్ శంకర్ తో భవదీయుడు భగత్ సింగ్ సినిమా కూడా ఒప్పుకున్న పవన్, తమిళ దర్శకుడుసముద్రఖని తో తమిళ మూవీ వినోదయ సితం రీమేక్ కూడా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. ఆపైన వీటితో పాటు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ తాళ్లూరి తో కూడా పవన్ ఒక మూవీ చేయనున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. మొత్తంగా త్వరలో పవన్ చేపట్టనున్న యాత్రతో ఈ సినిమాలు అన్నిటికీ బ్రేక్ పడ్డట్లే అని, ఒకవేళ వచ్చే ఏడాది ముందస్తుగా ఎన్నికలు వచ్చినట్లైతే ఇక పవన్ పూర్తిగా రాజకీయాలకే పరిమితం అయ్యే ఛాన్స్ లేకేపోలేదని మరికొందరు అంటున్నారు. మరి పవన్ సినిమా కెరీర్ ఎలా కొనసాగుతుందో, అసలు ఆయన ఇకపై సినిమాలు చేస్తారో లేదో అనే వాటిపై క్లారిటీ రావాలి అంటే స్వయంగా పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించే వరకు ఆగాల్సిందే అంటున్నారు విశ్లేషకులు. ఒకవేళ పవన్ సినిమాలు ఆపేస్తే మాత్రం అది నిజంగా ఆయన ఫ్యాన్స్ కి పూర్తిగా నిరాశ కలిగించే వార్తే అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: