ధనుర్మాసం ప్రారంభం అయిన తరువాత వచ్చే శుక్లపక్ష ఏకాదశి ని వైకుంఠ ఏకాదశి అని అంటారు. సౌర మానం ప్రకారం మార్గశిర పుష్య మాసాలలో ఏదో ఒక నెలలో ఈ పర్వదినం వస్తుంది. మధు కైటభులు వేదాలను అపహరించి వెళ్ళి పోతున్నప్పుడు ఆ రాక్షసులను సంహరించి వేదాలను రక్షించడానికి శ్రీమహావిష్ణువు ఉత్తర ద్వార మార్గం  నుండి బయటకు వచ్చి ఆ రాక్షస సంహారం పూర్తి అయిన తరువాత తిరిగి అదే ఉత్తర ద్వారం ద్వారా వైకుంఠం లోకి అడుగు పెట్టాడని శాస్త్రాలు చెపుతున్నాయి.


3 కోట్ల మంది దేవతలతో కలిసి విష్ణుమూర్తి భూలోకానికి విచ్చేసే అద్భుత ఘడియలు వైకుంఠ ఏకాదశి. ఈ రోజున ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించుకుంటే మోక్షం కలుగుతుందని అంటారు. ఈరోజు స్వర్గ ద్వారాలు అన్నీ తెరుచుకుని ఉంటాయి. ఉత్తర దిక్కు జ్ఞానికి ప్రతీక కాబట్టి పరమాత్మను జ్ఞానంతో సేవించాలి అన్నది ఈ ముక్కోటి ఏకాదశి లోని అంతరార్థం.


ఏ పనినైనా తూర్పు ముఖంగా చేయడం మన భారతీయుల ఆచారం. అలా తూర్పు దిశగా నిలబడినప్పుడు ఎడమ భాగంలో ఉత్తర దిక్కు ఉంటుంది. దేహానికి ఎడమ భాగం చాల ప్రధానమైంది అక్కడే మన హృదయం ఉంటుంది. ఆ హృదయం లోనే ప్రేమ ఆనందం భగవంతుడు నిండి ఉంటాయని పెద్దలు చెపుతూ ఉంటారు.


తూర్పు వైపు తిరిగి ఉత్తరం నుండి దక్షిణానికి అటు నుండి పడమర మీదగా మన యదాస్థానానికి వచ్చే విధంగా మన కార్యకలాపాలు నిర్వహించే ఆఫీసు ఉంటే మంచి ఫలితాలు వస్తాయని వాస్తు పండితులు చెపుతూ ఉంటారు. విష్ణువు సంచరించిన ఉత్తర మార్గం ద్వారా ప్రవేసించి ఆయన దర్శనం చేసుకుంటే మనం ఈ జన్మలో చేసుకున్న పాపాలు అన్నీ తొలిగిపోయి మనకు మోక్షం కలుగుతుందని చెపుతూ ఉంటారు. ఈరోజు భూమిమీడకు వచ్చే ముక్కోటి దేవతల ఆశిస్సులు ఒక్క వైకుంఠ ద్వార ప్రవేశంతో  మనం అందరం పొందవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: