హీరోలతో పోలిస్తే హీరోయిన్ల రెమ్యునరేషన్ తక్కువగా ఉంటుందన్న‌ సంగతి తెలిసిందే. హీరోలు రూ. 100 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తుంటే.. హీరోయిన్లు మాత్రం రూ. 12 కోట్ల వద్దే ఆగిపోయారు. పైగా ఆ రేంజ్ పారితోషికం అందుకునే హీరోయిన్లు కూడా చాలా లిమిటెడ్ గా ఉన్నారు. హీరో, హీరోయిన్ కు ఇచ్చే రెమ్యునరేషన్ల మధ్య గ్యాప్ గురించి చాలా ఏళ్లుగా చ‌ర్చ‌లు జరుగుతూనే ఉన్నాయి. ఎవరి వాదన వారు వినిపిస్తూనే ఉన్నారు. ఇటీవల సమంత మాట్లాడుతూ.. సినిమా కోసం స‌మానంగా కష్టపడుతున్నప్పుడు హీరో,హీరోయిన్ పారితోషికాల్లో వ్య‌త్యాసం ఎందుకని ప్రశ్నించింది. ఇండ‌స్ట్రీలో ఇబ్బంది పెట్టే విషయాల్లో ఇది ఒకటి అని.. కానీ తన ప్రొడక్షన్ హౌస్ లో రెమ్యునరేషన్ విషయంలో వ్యత్యాసం లేకుండా చూసుకుంటానని చెప్పుకొచ్చింది.


తాజాగా కీర్తి సురేష్ కూడా ఈక్వల్ పే గురించి మాట్లాడింది. కీర్తి సురేష్, సుహాస్‌ ప్రధాన‌ పాత్రల్లో తెర‌కెక్కిన `ఉప్పు క‌ప్పురంబు` సినిమా నేరుగా అమెజాన్ ప్రైమ్ లో జూన్ 4న రిలీజ్ కాబోతోంది. ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్.. ఈక్వల్ రెమ్యున‌రేష‌న్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. `రెమ్యునరేషన్ అనేది ఆడవాళ్లు మగవాళ్లకు సంబంధించింది కానే కాదు. ఈ విషయంలో ఈక్వాలిటీ తీసుకురావాలి అనుకోవడంలో అర్థం లేదు. ఒక మేల్ యాక్టర్ త‌న స్టార్డ‌మ్‌, క్రేజ్ తో థియేటర్స్ కి జనాలను ఎలా రప్పించి మార్కెట్ చేస్తున్నారో.. అదే విధంగా ఒక ఫిమేల్ యాక్టర్‌ చేయగలగాలి.


థియేట‌ర్స్ కు జనాల‌ను రప్పించే స్టామిన, మార్కెట్ ఉంటే మెయిల్ యాక్టర్ తో సమానంగా ఫిమేల్ యాక్టర్ కు కూడా రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిందే.  హీరోలకు మాత్ర‌మే ఎక్కువ‌ ఇస్తారంటే వాళ్లను చూసి ఫ్యాన్స్ చాలా మంది వస్తారు. హీరోయిన్ తో కూడా సినిమా చేస్తే ఇన్ని కోట్లు వస్తాయి.. జ‌నాలు వ‌స్తారు అనుకుంటే క‌చ్చితంగా సమాన రెమ్యున‌రేషన్ ఇవ్వాలి` అంటూ కీర్తి సురేష్ వ్యాఖ్యానించింది. ప్ర‌స్తుతం ఆమె కామెంట్స్ నెట్టింట వైర‌ల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: